చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పరిధిలోని 5 పోలింగ్ కేంద్రాల్లో రీ పోలింగ్ నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఈ మేరకు ఆయా కేంద్రాల్లో ఈ నెల 19వ తేదీ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ పోలింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. చంద్రగిరి నియోజకవర్గం పరిధిలోని ఎన్.ఆర్.కమ్మపల్లి, పులవర్తివారిపల్లి, కొత్త కండ్రిగ, కమ్మపల్లి, వెంకటరామాపురం కేంద్రాల్లో రిపోలింగ్ జరగబోతుంది.
అయితే ఈ నిర్ణయంతో తెలుగుదేశం నాయకులు ఖంగుతిన్నారు. ఎందుకంటే ఈ ఐదు గ్రామాలూ టీడీపీ అనుకూల గ్రామాలు… ఎన్నికల అనంతరం వేసిన లెక్కలలో ఈ సారి చెవిరెడ్డి ఓడటం ఖాయమని టీడీపీ వారు లెక్కలు వేసుకున్నారు. ఇప్పుడు ఈ రీపోలింగ్ వల్ల ఫలితం రసకందాయంలో పడే అవకాశం ఉంది. ఇందులో కుట్ర కోణం ఉందని కూడా టీడీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. పోలింగ్ రోజు చెవిరెడ్డి ఇక్కడ రిపోలింగ్ కు కనీసం డిమాండ్ కూడా చెయ్యలేదు.
ఎన్నికల తరువాత లెక్కలు వేసుకుని ఓటమి భయం తోనే రిపోలింగ్ కు అడిగారని, కేంద్రంలోని ప్రభుత్వం అనుకూలంగా ఉండటంతో ఎన్నికల సంఘం కూడా వారికి అనుకూలమైన నిర్ణయం తీసుకుందని టీడీపీ వారి ఆరోపణ. పోలింగ్ అయిపోయిన 35 రోజుల తరువాత రిపోలింగ్ కు అనుమతి ఇవ్వడం గమనార్హం. ఈ రిపోలింగ్ ను చెవిరెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకోబోతున్నారు. తాను గెలిచి వైఎస్సార్ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తనకు కేబినెట్ పదవి గారంటీ అని కావున ఈ అవకాశం వదులుకోకూడదని ఆయన భావిస్తున్నారు.



