ఇండస్ట్రీ ఎప్పుడూ ఇంతేనా? పవన్‌కు మద్దతుగా ముగ్గురేనా?

Pawan-Kalyan-megastar-chiranjeevi

మెగాస్టార్ చిరంజీవి పిఠాపురం నుంచి శాసనసభకు పోటీ చేస్తున్న తన తమ్ముడు పవన్‌ కళ్యాణ్‌కు మద్దతు తెలుపుతూ ఓ వీడియో సందేశం సోషల్ మీడియాలో విడుదల చేశారు.

దానిలో పవన్‌ కళ్యాణ్‌ని పొగిడి పిఠాపురం ప్రజలందరూ గ్లాసు గుర్తుకే ఓట్లు వేసి పవన్‌ కళ్యాణ్‌ని గెలిపించమని చిరంజీవి విజ్ఞప్తి చేశారు.

ADVERTISEMENT

చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు పవన్‌ కళ్యాణ్‌ మరో ఆలోచన చేయకుండా వచ్చి అన్న తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కానీ తమ్ముడు పవన్‌ కళ్యాణ్‌ ఇన్ని ఆటుపోట్లు ఎదుర్కొంటూ చాలా ధైర్యంగా ముందుకు సాగుతున్నా చిరంజీవి ఎక్కడో కూర్చొని మాట్లాడారు తప్ప తమ్ముడికి మద్దతుగా ఎన్నికల ప్రచారానికి రావడం లేదు.

చిరంజీవి తన వీడియో సందేశంలో కనీసం జనసేన అభ్యర్ధులు అందరినీ గెలిపించమని కోరకపోవడం గమనిస్తే, ఒకవేళ ఎన్నికలలో వైసీపి గెలిస్తే తనకు, తన సినిమాలకు ఏపీలో ఎటువంటి ఇబ్బంది కలగకుండా ముందు జాగ్రత్త పడుతున్నట్లు భావించవచ్చు.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి జరుగుతున్న నష్టాన్ని కళ్ళారా చూస్తూ బాధపడుతున్న చిరంజీవి వంటి సమాజాన్ని ప్రభావితం చేయగల ప్రముఖులు కూడా నేటికీ తమ మౌనాన్ని వీడి రాష్ట్రం కోసం పోరాడుతున్న పవన్‌ కళ్యాణ్‌కు, జనసేనకు, వారి కూటమికి బహిరంగంగా మద్దతు తెలపడానికి భయపడుతుండటం చాలా శోచనీయం.

చంద్రబాబు నాయుడుని జగన్‌ జైల్లో పెడితే ఏనాడూ రాజకీయాలలో కలుగజేసుకోని ఆయన సతీమణి భువనేశ్వరి, కోడలు బ్రాహ్మిణి ఇద్దరూ మరో ఆలోచన చేయకుండా వెంటనే ప్రజల మద్యకు వచ్చి ఆయనకు జరిగిన అన్యాయం గురించి నేరుగా జగన్మోహన్‌ రెడ్డినే నిలదీసి ప్రశ్నించారు.

పోసాని కృష్ణ మురళి వంటివారు కూడా పర్యవసనాలకు భయపడకుండా ధైర్యంగా వైసీపి, జగన్మోహన్‌ రెడ్డి తరపున బహిరంగంగా మాట్లాడుతూ మద్దతు తెలుపుతున్నారు.

పిఠాపురంలో వైసీపి మూకలు దాడులు చేస్తున్నా సాయిధరం తేజ ధైర్యంగా నిలబడి పవన్‌ కళ్యాణ్‌ తరపున ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. రాజ్‌ తరుణ్, నాని కూడా ముందుకు వచ్చి పవన్‌ కళ్యాణ్‌ మద్దతు పలికారు. అయితే ఇండస్ట్రీలో నుంచి ముగ్గురేనా? మరెవరూ ముందుకు రారా?

నిఖిల్, నితిన్‌తో సహా ఇంకా చాలా మంది చిన్నాపెద్ద నటులు తమ సినిమాలలో పవన్‌ కళ్యాణ్‌ పేరు, ఫోటోలు, పాటలు వాడేసుకుంటారు. కానీ పవన్‌ కళ్యాణ్‌కు అవసరమైనప్పుడు ఇండస్ట్రీలో నుంచి ఎవరూ ముందుకు రారా? ముఖ్యంగా మెగా ఫ్యామిలో ఎవరూ వచ్చి పవన్‌ కళ్యాణ్‌, జనసేనలకు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనరా? అని పవన్ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సినీ ఇండస్ట్రీలో ఓ ప్రముఖ నటుడైన పవన్‌ కళ్యాణ్‌ ధైర్యంగా జగన్మోహన్‌ రెడ్డికి ఎదురొడ్డి పోరాడుతుంటే, కనీసం చిరంజీవి ప్రజల మద్యకు వచ్చి నా తమ్ముడిని, జనసేన పార్టీని, కూటమిని గెలిపించమని అడిగే ధైర్యం చేయలేకపోతున్నారంటే ఏమనుకోవాలి?

ఈ ఎన్నికలలో కూటమి ఓడిపోతే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఏమవుతుందో కనబడుతూనే ఉంది. ముఖ్యంగా పవన్‌ కళ్యాణ్‌, జనసేనలకు ఇదే అంతిమ పోరాటం. ఓడితే రాజకీయంగానే కాదు… ఆయన సినిమాలు ఏపీలో విడుదల చేసుకోవడం కష్టమే. ఒకవేళ పవన్‌ కళ్యాణ్‌ సినిమాలు చేయలేని పరిస్థితి ఏర్పడితే ఆర్ధికంగా కుప్పకూలిపోయే ప్రమాదం కూడా ఉంది.

అంటే పవన్‌ కళ్యాణ్‌ తన సినీ, రాజకీయ జీవితాలను, తన సంపదను, తన భవిష్యత్‌ని, తన కుటుంబాన్ని, చివరికి తన వ్యక్తిగత జీవితాన్ని కూడా పణంగా పెట్టి రాష్ట్ర ప్రజల కోసం పోరాడుతున్నారు. ఇటువంటి అత్యంత కీలక సమయంలో కూడా చిరంజీవి, సినీ ప్రముఖులు ఎవరూ ధైర్యంగా బయటకు వచ్చి మద్దతు పలుకకపోతే ఇంకెప్పుడు పలుకుతారు?

ఇప్పుడు పవన్‌ కళ్యాణ్‌కు, జనసేనకు, వారి కూటమికి బహిరంగంగా మద్దతు పలకడానికి భయపడుతున్న చిరంజీవితో సహా సినీ ప్రముఖులందరూ, రేపు ఎన్నిలలలో కూటమి గెలిచి, పవన్‌ కళ్యాణ్‌ ఏ మంత్రి పదవో చేపడితే అప్పుడు ఆయనకు అభినందనలు తెలియజేయడానికి, ఆయన గొప్పదనం పొగిడేందుకు పోటీలు పడకుండా ఉండరు.

కానీ పవన్‌ కళ్యాణ్‌కు, జనసేనకు వారి మనుగడకు కూడా చాలా కీలకమైన ఈ ఎన్నికల సమయంలో సాయపడకుండా, ధైర్యంగా ప్రజల మద్యకు వచ్చి మద్దతు ఇవ్వకుండా ఆ తర్వాత ఎంత కీర్తిస్తే మాత్రం ఏం ప్రయోజనం?

ADVERTISEMENT
Latest Stories