ధనమదం గురించి కేసీఆర్‌ మాట్లాడుతుంటే….

KCR-Kamareddy

తెలంగాణ సిఎం కేసీఆర్‌ వరుసపెట్టి ఎన్నికల ప్రచార సభలలో పాల్గొంటూ బిఆర్ఎస్ పార్టీ తరపున జోరుగా ప్రచారం చేస్తున్నారు. శుక్రవారం ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో ప్రజలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “ఈ జిల్లాలో కొందరు నాయకులు ధనమదంతో విర్రవీగుతున్నారు. ఈ ఎన్నికలలో డబ్బు, మద్యం పంచిపెట్టి మిమ్మల్ని ప్రలోభపెట్టి సులువుగా గెలిచేయగలమని ధీమాతో ఉన్నారు. ప్రజలను, ప్రజాస్వామ్యాన్ని డబ్బుతో కొనేయగలమని భావిస్తున్నారు. ఇది రాజకీయమా? ఇలాంటి రాజకీయ నాయకులు మనకి అవసరమా? మీరందరూ ఆలోచించాలని విజ్ఞప్తి చేస్తున్నాను,” అని అన్నారు.

రాజకీయాలను, ఎన్నికలను చాలా ఖరీదైన వ్యవహారంగా మార్చిందే కేసీఆర్‌ అని అందరికీ తెలుసు. బిఆర్ఎస్ పార్టీ అత్యంత ధనిక పార్టీ అని కేసీఆర్‌ సగర్వంగా చెప్పుకొంటారు కూడా. బిఆర్ఎస్ పార్టీకి 33 జిల్లాలో మూడేసి ఎకరాలు చొప్పున కేటాయించి పార్టీ కార్యాలయాలు నిర్మింపజేశారు కూడా. ఓ ప్రాంతీయ పార్టీ అయిన బిఆర్ఎస్ దేశ రాజధాని ఢిల్లీ నడిబొడ్డున పార్టీ కార్యాలయం నిర్మించుకొన్నారు. ఎకరం 106 కోట్లు పలికిన హైదరాబాద్‌ శివారులోని కోకాపేటలో 11 ఎకరాలలో బిఆర్ఎస్ పార్టీకి మరో కార్యాలయం నిర్మింపజేయిస్తున్నారంటే కేసీఆర్‌ రేంజ్ ఏమిటో అర్దంచేసుకోవచ్చు.

ADVERTISEMENT

జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పి ప్రధానమంత్రి కావాలనే తపనతో కేసీఆర్‌ ప్రత్యేక విమానాలు వేసుకొని దేశంలో పలు రాష్ట్రాలలో పర్యటించడం అందరూ చూశారు. కర్ణాటక ఎన్నికలలో కుమారస్వామికి ఆర్ధికసాయం అందించి ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పారు. కానీ కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీని గెలిపించేందుకు కేసీఆర్‌ డబ్బు మూటలు పంపించారని ప్రధాని నరేంద్రమోడీ స్వయంగా ఆరోపించారు.

మహారాష్ట్రలో బిఆర్ఎస్ పార్టీని విస్తరించడానికి ఆయన చేస్తున్న ప్రయత్నాలు అందరూ చూస్తూనే ఉన్నారు. అన్నీ అనుకూలించి ఉంటే ఏపీలో కూడా బిఆర్ఎస్ పార్టీని విస్తరించడానికి సిద్దపడ్డారు. తెలంగాణ శాసనసభ ఎన్నికలలో కూడా బిఆర్ఎస్ పార్టీలో ఒక్కో అభ్యర్ధికి రూ.40 లక్షల చొప్పున కేసీఆర్‌ స్వయంగా చెక్కులు అందజేశారు. ఇది అధికారిక లెక్క కోసం మాత్రమే.

పవన్‌ కళ్యాణ్‌ తన జనసేన పార్టీని నడిపించుకోవడానికి నానా తిప్పలు పడుతున్నారు. దాని కోసమే తాను సినిమాలు చేస్తున్నానని చెప్పుకోవడం అందరూ వింటూనే ఉన్నారు. ఓ ప్రాంతీయ పార్టీని నడిపించడమే ఇంత కష్టంగా ఉన్నప్పుడు కేసీఆర్‌ అన్ని రాష్ట్రాలలో బిఆర్ఎస్ పార్టీని బరిలో దింపడానికి సిద్దం అవుతున్నారంటే ఎంత ఖర్చు చేయబోతున్నారో ఎవరూ ఊహించుకోలేరు. ఇవన్నీ వేల కోట్ల పెట్టుబడితో చేస్తున్న రాజకీయాలే కదా? డబ్బుతో రాష్ట్ర, దేశ రాజకీయాలను శాశించాలని చూస్తున్న కేసీఆర్‌, తన ప్రత్యర్ధులు ధన మదంతో విర్రవీగుతున్నారని అనడం చాలా విడ్డూరంగా ఉంది. ఈవిదంగా నందిని పంది అని పందిని నంది అని నమ్మించగల వాక్చాతుర్యం కేసీఆర్‌కి మాత్రమే ఉందనిపిస్తుంది.

ADVERTISEMENT
Latest Stories