ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కులాల ప్రభావం కొత్తది కాదు. గతంలో కేవలం ఎన్నికల సమయంలోనే ఎక్కువగా కుల సమావేశాలు, సమీకరణలు జరుగుతుండేవి.
వైసీపీ మాత్రం ఎన్నికలతో సంబంధం లేకుండా కుల రాజకీయాలు చేస్తూనే ఉంది. ప్రభుత్వంపై రాజకీయంగా పైచేయి సాధించేందుకు ఇదే సరైన మార్గమని విశ్వసిస్తున్నట్లుంది.
టీడీపీ, జనసేన, వైసీపీ మూడు పార్టీలకు వేర్వేరు కులాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న మాట వాస్తవమే అయినప్పటికీ, టీడీపీ, జనసేనలు కులాలకు అతీతంగా ముందుకు సాగుతుంటే, యువకుడైన జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో నడుస్తున్న వైసీపీ మాత్రం కులమతాల వద్దే ఆగిపోవడం శోచనీయం.
ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ నేతలతో సమావేశమైనప్పుడు ఎల్లప్పుడూ ప్రతి దానిని కులం కోణంలోనే చూడటం, ఆలోచించడం, స్పందించడం సరికాదన్నారు. ఈ కులాలను పక్కన పెట్టి సమాజంలో అందరూ ఐక్యంగా ముందుకు సాగినప్పుడే అభివృద్ధి సాధ్యమన్నారు. మనం మన కులం గురించి కాదు.. మన తెలుగు భాష, మన రాష్ట్రం, జరుగుతున్న, జరగాల్సిన అభివృద్ధి గురించి మాట్లాడుకోవాలన్నారు.
సీఎం చంద్రబాబు నాయుడు కూడా ప్రజలు కులమతాల విభజన కోరుకోవడం లేదని, రాష్ట్ర అభివృద్ధి, పరిశ్రమలు, ఉద్యోగాలు, ఉపాధితో కూడిన మంచి జీవితం కోరుకుంటున్నారన్నారు.
ఈ విధంగా సీఎం, డిప్యూటీ సీఎంలు అభ్యుదయ దృక్పదం కనబరుస్తుంటే, వైసీపీ నేతలు మాత్రం కాపు సామాజిక వర్గ నేతలతో సమావేశాలు నిర్వహిస్తూ సమాజంలో కుల విభజనను పెంచి పోషిస్తున్నట్లు కనిపిస్తోంది.
మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఇటీవల కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకులు, కార్యకర్తలతో ప్రత్యేక సమావేశం నిర్వహించడమే ఇందుకు తాజా నిదర్శనం.
ఉద్యోగాలు, ఉపాధి విషయంలో కూడా కూటమి ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం ఆలోచనా ధోరణిలో చాలా తేడా ఉంది. వైసీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాల పేరుతో ప్రజలకు డబ్బు పంచుతూ ప్రభుత్వంపై ఆధారపడేలా చేస్తే, కూటమి ప్రభుత్వం పరిశ్రమలు, ఐటీ కంపెనీలు తీసుకువచ్చి ఉద్యోగాలు, ఉపాధి కల్పిస్తూ ప్రజలు ఎవరి కాళ్లపై వారు నిలబడేలా చేస్తోంది.
ఈ నేపధ్యంలో చూస్తే వైసీపీ, కూటమి ప్రభుత్వాల విధానాలు, ఆలోచనా ధోరణిలో నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా స్పష్టంగా కనిపిస్తోంది.
కనుక కుల, మత రాజకీయాలు, సంక్షేమ పధకాలే ముఖ్యమా?లేక అభివృద్ధి, ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు అవసరమా రాష్ట్ర ప్రజలే నిర్ణయించుకోవాలి.




