రాజకీయ పార్టీలకు విశ్వసనీయత అనేది చాలా ముఖ్యం. ఏపీలో వైసీపికి దానిపై పేటెంట్ రైట్స్ ఉన్నాయని చెప్పుకొంటుంది. అది వేరే విషయం.
కానీ విశ్వసనీయత దెబ్బ తింటే పరిస్థితులు ఎలా తారుమారు అవుతాయో తెలుసుకొనేందుకు తెలంగాణలో బీజేపీ, బిఆర్ఎస్ పార్టీల తిప్పలు చూస్తే అర్దమవుతుంది.
ఆ రెండు పార్టీలకు మద్య రహస్య అవగాహన ఉందని ఇంతకాలం కాంగ్రెస్ వాదిస్తూనే ఉంది. అయితే దాని వాదనలను ఎవరు పట్టించుకొంటారు?అని ఆ రెండు పార్టీలు నిర్లక్ష్యం వహించాయి. ఇప్పుడు ఎన్నికలలో అదే వాటి కొంప ముంచబోతోంది.
బిఆర్ఎస్ పార్టీతో తమకు ఎటువంటి రహస్య సంబందమూ లేదని చెప్పుకొనేందుకు ప్రధాని నరేంద్రమోడీ, కేసీఆర్తో జరిగిన వ్యక్తిగత సంభాషణను ఓ సభలో బయటపెట్టారు. బిఆర్ఎస్ పార్టీ ఎన్డీయే కూటమిలో చేరేందుకు సిద్దంగా ఉందని, తన కుమారుడు కేటీఆర్ని ముఖ్యమంత్రిని చేసేందుకు తోడ్పడాలని కేసీఆర్ కోరారని, కానీ తాను తిరస్కరించానని ప్రధాని నరేంద్రమోడీ చెప్పారు.
కేసీఆర్,మోడీల మద్య రహస్య అవగాహన ఉన్నందునే కల్వకుంట్ల కవితపై చర్యలు తీసుకోలేదని, కేసీఆర్ సూచన మేరకే ఎన్నికలకు ముందు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ని ఆ పదవి నుంచి తొలగించారని కాంగ్రెస్ వాదిస్తోంది. ఇవి సహేతుకంగానే ఉన్నదున బీజేపీ విశ్వసనీయత దెబ్బ తింది. అందుకే ప్రధాని మోడీ నష్టనివారణకు ఈవిషయం బయటపెట్టారని అర్దమవుతోంది.
బీజేపీకి, బిఆర్ఎస్ పార్టీకి మద్య రహస్య సంబంధం ఉందనే కాంగ్రెస్ ప్రచారం వలన బీజేపీ నష్టపోతుంది తప్ప తమకు ఏమీ కాదని కేసీఆర్ భావించారు. కానీ ఇప్పుడు అదే కారణంగా బిఆర్ఎస్ విశ్వసనీయత దెబ్బ తిందని, అది కాంగ్రెస్కు అనుకూలంగా మారిందని కేసీఆర్ ఆలస్యంగా గ్రహించారు. బీజేపీ, బిఆర్ఎస్ పార్టీలను ముడిపెట్టి కాంగ్రెస్ చేస్తున్న ఈ వాదనలతో ఎన్నికలలో నష్టపోతామని గ్రహించిన కేసీఆర్, కేటీఆర్ కాంగ్రెస్ పార్టీ తమపై దుష్ప్రచారం చేస్తోందని, కనుక అందరూ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.
అయితే నేటికీ బీజేపీ, బిఆర్ఎస్ పార్టీలు పరస్పరం సహకరించుకొంటున్నాయని కాంగ్రెస్ నేతలు ఎప్పటికప్పుడు సాక్ష్యాధారాలతో సహా ప్రజల ముందుంచుతూనే ఉన్నారు. పోలింగ్ దగ్గర పడుతున్నప్పుడు కాంగ్రెస్ అభ్యర్ధుల ఇళ్ళు, కార్యాలయాలపై ఐటి దాడులు, రైతులకు రైతు బంధు నిధులు విడుదలకు ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం వంటివి చూపిస్తుండటంతో బీజేపీ, బిఆర్ఎస్ పార్టీల పట్ల ప్రజలలో వ్యతిరేకత నెలకొంది.
ఈ వ్యతిరేకతనే కాంగ్రెస్ తనకు అనుకూలంగా మలుచుకొని ఎన్నికలలో విజయం సాధించేందుకు గట్టిగా ప్రయత్నిస్తోంది. అంటే పార్టీలు విశ్వసనీయత ఎంత ముఖ్యమో అర్దమవుతోంది కదా?




