సోషల్ మీడియాలో నేడు ఓ చక్కటి రాజకీయ వ్యాఖ్య, విమర్శ వచ్చింది. ఇదివరకు పార్టీ అధినేతలను కోటరీలు భ్రమలో ఉంచుతుండేవి. కానీ గత 10 ఏళ్ళుగా పార్టీల సొంత మీడియా, సోషల్ మీడియా, యూట్యూబ్ అనలిస్టులు, ఇంకా అనుకూల మీడియా కలిసి పార్టీ కార్యకర్తలను, అభిమానులను భ్రమలో ఉంచుతున్నాయి.
అవి చెప్పినవే వింటూ, చూస్తూ అవే నిజమనే భ్రమలో ఉంటారు. కానీ ఎన్నికల ఫలితాలు రాగానే అందరూ షాక్ అవుతుంటారని దాని సారాంశం.
ఇది అక్షరాల వాస్తవమని అందరికీ తెలుసు. ఇదివరకు తెలంగాణలో కేసీఆర్, ఏపీలో చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి ఇంకా పలు రాష్ట్రాలలో ముఖ్యమంత్రులు ఇలాగే తమ చుట్టూ చేరిన కోటరీలు చెప్పే కధలు వింటూ మురిసిపోయి చివరికి నష్టపోయారు.
కానీ నేటికీ వారిలో కోటరీలను చేధించుకొని జనం మధ్యకు వస్తున్నవారు చాలా తక్కువ. వారిలో జ్ఞానోదయం పొందిన చంద్రబాబు నాయుడు ఒక్కరే ప్రతీ నెలా క్రమం తప్పకుండా ప్రజల మధ్యకు వెళుతున్నారు. వారి కష్ట సుఖాలు, అభిప్రాయాలు అడిగి తెలుసుకుంటున్నారు.
జగన్, కేసీఆర్ వంటివారి చుట్టూ నేటికీ కోటరీలున్నాయని విజయసాయి రెడ్డి, కల్వకుంట్ల కవిత చెప్పిన సంగతి తెలిసిందే. కనుక వారు ఇంకా ‘ప్రజలు మనవైపే ఉన్నారు. మనమే అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారు…కనుక మళ్ళీ మనమే అధికారంలోకి వచ్చేస్తామనే..” భ్రమలో ఉండిపోయి ఫామ్హౌసు, ప్యాలస్ గడప దాటడం లేదు. అక్కడి నుంచి నేరుగా ముఖ్యమంత్రి ఛాంబర్లోకి వెళ్ళిపోగలమని గట్టిగా నమ్ముతున్నారు. వారి నమ్మకాలు… వారిష్టం… ఎవరూ కాదనలేరు.
కానీ అధికార, ప్రతిపక్షాల సొంత, అనుకూల మీడియాల ద్వారా పార్టీ కార్యకర్తలను, అభిమానులను, శ్రేయోభిలాషులను, చివరికి ప్రజలను కూడా భ్రమింపజేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
మళ్ళీ మనమే వస్తామని అందరినీ నమ్మింపజేయడం కూడా ఓ రాజకీయ వ్యూహమని వారు అనుకోవచ్చు. ఎన్నికలలో గెలిచేందుకు వ్యూహాలు, ప్రచారం చాలా అవసరమే.
కానీ ప్రజలను మెప్పించాలంటే అధికారంలో ఉన్నవారు వారి ఆకాంక్షలకు అనుగుణంగా పని చేయాలి. వారి సమస్యలను పరిష్కరించాలి. వారి జీవన ప్రమాణాలు పెంచగలగాలి. ఇవన్నీ చేస్తుంటే గుర్తించలేనంత అమాయకులు కారు ప్రజలు. అటువంటి పార్టీలను వారే నెత్తిన పెట్టుకుంటారు.
ప్రతిపక్షాలంటే ప్రభుత్వాన్ని దానిని నడిపే పార్టీని, దాని అధినేతని విమర్శిస్తూనే ఉండాలి. ఆరోపణలు చేస్తూనే ఉండాలి. ప్రభుత్వం ఏం చేసినా తప్పు పడుతూనే ఉండాలనే మూస ధోరణిలో సాగుతుంటాయి.
ఇలాంటి వ్యూహాలు ఫలించవని తెలిసి ఉన్నా గుడ్డిగా అలాగే ముందుకు సాగుతుంటారు. చివరికి బోర్లా పడుతుంటారు. పడినప్పుడు ఇంతకాలం వారు చెప్పిందే విని నిజమని నమ్మినవారు కూడా షాక్ అవుతుంటారు.
రాజకీయ పార్టీలు ఈవిదంగా ఓ మూస ధోరణిలో కొట్టుకుపోతూ ఆ ప్రవాహంలోకి అందరినీ లాగేస్తూ, కలిసి మునుగుదామంటాయి. కనుక రాజకీయ నాయకులు చెపుతున్నట్లు ప్రజలే మేల్కొనాలి.






