ఉత్తరాంధ్రా సీనియర్ రాజకీయ నాయకులలో దాడి వీరభద్రరావు కూడా ఒకరు. ఆయన లెక్కల మాష్టారుగా పనిచేసినప్పటికీ ఆయన లెక్క ఎప్పుడూ తప్పుతూనే ఉంటుంది. మొదట ఆయన టిడిపిలోనే ఉండేవారు. కానీ రాష్ట్ర విభజన సమయంలో జరిగిన ఎన్నికలలో అంటే 2014 ఎన్నికలలో టిడిపి ప్రభంజనం ఉంటుందని దాడి మాష్టారు గుర్తించలేకపోయారు.
దాంతో గెలవబోతున్న టిడిపిని వీడి ఓడిపోబోయే వైసీపిలో చేరి కుమారుడు దాడి రత్నాకర్కి విశాఖ టికెట్ తెచ్చుకోగలిగారు. కానీ రత్నాకర్ ఓడిపోయారు. ఆ తర్వాత వైసీపిలో ఆయనను ఎవరూ పట్టించుకోకపోవడంతో రాజీనామా చేసి బయటకు వచ్చేశారు.
మళ్ళీ టిడిపి గూటికి వద్దామనుకొంటే స్థానిక టిడిపి నేతలు గేట్లు తెరవలేదు. కనుక 2019 ఎన్నికలకు ముందు వైసీపి తలుపు తడితే లోపలకు రానిచ్చారు. కానీ సీట్ ఇవ్వలేదు. జగన్ కనీసం పట్టించుకోలేదు. అయినా ఇంతకాలం దాడి మాష్టారు చాలా ఓపికగా ఎదురుచూశారు.
తాజాగా సిఎం జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలను అటూ ఇటూ మార్చుతూ, కొందరిని పక్కన పెడుతూ వైసీపి నేతలకి టికెట్ల కేటాయింపులు జరుపుతుండటంతో తనకు సీటు కేటాయిస్తారేమోనని దాడి మాష్టారు చాలా ఆతృతగా ఎదురుచూశారు.
కానీ ఆ జాబితాలలో ఎక్కడా ఆయన పేరులేకపోవడంతో తీవ్ర నిరాశతో మంగళవారం వైసీపికి (రెండోసారి) రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను జగన్మోహన్ రెడ్డితో పాటు వైసీపిలో చక్రం తిప్పుతున్న సజ్జల రామకృష్ణా రెడ్డికి, ఎంపీ విజయ సాయిరెడ్డికి కూడా పంపారు. కానీ ఎవరూ ఆయన లేఖను పట్టించుకోలేదు.
ఇప్పటికీ దాడి వీరభద్రరావు తిరిగి టిడిపిలోకి వెళ్ళేందుకు అవకాశం లేకపోవడంతో జనసేనలో చేరేందుకు సిద్దమవుతున్నారు. టిడిపి, జనసేనల పొత్తులలో భాగంగా విశాఖ సీటు జనసేనకు లభిస్తే, దానిని పవన్ కళ్యాణ్ ఆయనకే ఇస్తే పర్వాలేదు. ఈసారి టిడిపి, జనసేనలకు సానుకూల వాతావరణం నెలకొని ఉంది కనుక దాడి వీరభద్రరావు జనసేన టికెట్ సంపాదించుకొని గెలవలగలిగితే మళ్ళీ ఆయన దశ తిరగవచ్చు.
కానీ ఆయన కోసం విశాఖ నుంచి పోటీ చేయాలనుకొంటున్న జనసేన నేతలని పక్కన పెట్టకూడదని పవన్ కళ్యాణ్ భావిస్తే, దాడి మాష్టారి లెక్క మళ్ళీ తప్పుతుంది. కనుక ఈసారైనా మాష్టారి లెక్క కుదురుతుందో లేదో చూడాలి.




