ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఇప్పుడు ధైర్యంగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడలేని పరిస్థితి నెలకొంది. విజయవాడలో ఆమె పార్టీ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చినప్పుడు, విలేఖరి అడిగిన ప్రశ్నలకు ఆమె చెప్పిన సమాధానలే ఇందుకు నిదర్శనం.
ప్రశ్న: ఆరోజు మీరు, నారా లోకేష్ కలిసి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఆ సమావేశంలో అసలు ఏమి మాట్లాడుకొన్నారు? ఏమి నిర్ణయించారు?
జవాబు: ఆరోజు ఏమి మాట్లాడుకొన్నామో అప్పుడే ట్వీట్ చేశాను కదా? జగన్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడుపై రాజకీయ కక్షతో తప్పుడు కేసులు నమోదు చేసి అరెస్టు చేయించిందని నారా లోకేష్ అమిత్ షాకు చెప్పగా, చంద్రబాబు నాయుడు ఆరోగ్యం ఏవిదంగా ఉందని అమిత్ షా అడిగి తెలుసుకొన్నారు.
ప్రశ్న: జనసేనతో బీజేపీ పొత్తు ఇంకా ఉందా లేదా?పవన్ కళ్యాణ్ వారాహి యాత్రలలో టిడిపి జెండాలు కనబడుతున్నాయి కానీ బీజేపీ జెండాలు ఎక్కడా కనిపించడం లేదు?
జవాబు: ఇట్స్ ఓకే! ఎన్నికలు దగ్గరపడినప్పుడు మా అధిష్టానం దీనిపై నిర్ణయం తీసుకొంటుంది. దాన్ని మేము ఫాలో అవుతాము.
ప్రశ్న: తెలంగాణలో మీ పార్టీ జనసేనతో పొత్తు పెట్టుకొంటుందా?
జవాబు: ఈ ప్రశ్న నన్ను కాదు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడుని అడగాలి మీరు.
ప్రశ్న: జగన్మోహన్ రెడ్డి దసరాకి విశాఖ షిఫ్ట్ అయిపోతామంటున్నారు?ఏపీకి విశాఖ రాజధాని అంటున్నారు. మీరేమంటారు?
జవాబు: మా పార్టీ మొదటి నుంచి కూడా అమరావతి రాజధానికే కట్టుబడి ఉంది.
పాపం పురందేశ్వరి పొత్తుల గురించి మాట్లాడలేరు. చంద్రబాబు నాయుడు అరెస్టు వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం, బీజేపీ అధిష్టానం వైఖరి ఏమిటో చెప్పలేరు. చివరికి జగన్ విశాఖ రాజధాని అంటున్నా కుదరదని చెప్పలేకపోతున్నారు.
జగన్ నెలనెలా బటన్ నొక్కుతూ ముందుకు సాగిపోతున్నారు. కానీ ఢిల్లీ పెద్దలు వర్చువల్గా కూడా ఏపీ బీజేపీకి బటన్ నొక్కడం లేదు. దీంతో అందరూ నోరు కుట్టేసుకోవలసి వస్తోంది. ఎంతో ఉత్సాహంగా ఏపీ బీజేపీ బాధ్యతలు చేపట్టిన దగ్గుబాటి పురందేశ్వరిని బీజేపీ అధిష్టానం మాట్లాడనీయకుండా చేసేసింది. ఈవిదంగా వ్యవహరిస్తున్నప్పుడు ఏపీ బీజేపీ బలపడేదెప్పుడు?ప్రజలు నమ్మేదెప్పుడు?






