ప్రకాశం జిల్లా పర్చూరు స్థానం నుంచి మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు వైకాపా నుంచి బరిలోకి దిగారు. వాస్తవానికి ఈ సీటును ఆయన కుమారుడు హితేష్కు ఆశించినా.. పౌరసత్వం విషయంలో తలెత్తిన సమస్యతో సాధ్యపడలేదు. కొడుకు సీటు కోసం జగన్ వద్దకు వెళ్ళిన వెంకటేశ్వరరావునే చివరికి బరిలోకి దిగారు. గత ఎన్నికలలో ఆయన పోటీ చెయ్యలేదు. ఇక ఎన్నికల రాజకీయాలు చెయ్యనని ప్రకటించేశారు కూడా. అయితే కొడుకు కోసం మాట మార్చుకున్నారు.
టీడీపీ నుంచి గెలిచిన ఏలూరి సాంబశివరావు రెండోసారి పోటీలో ఉన్నారు. దగ్గుబాటి ఈ ఎన్నికను ప్రెస్టీజియస్ గా తీసుకుని పని చేశారు. భారీగా ఖర్చుపెట్టారు కూడా. విజయంపై ఆయన ధీమాగా ఉన్నారు. మరోవైపు ఆయన గెలిచాక స్పీకర్ కావాలనుందట.వైఎస్సార్ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తనకు మంత్రి పదవి ఇచ్చే అవకాశముంటే సరే లేకుంటే అసెంబ్లీ స్పీకర్గా నియమించాలని వైఎస్ జగన్ను కోరారట. గుడివాడ నుండి కొడాలి నాని ఓడిపోతే తనకు మంత్రి పదవి వచ్చే అవకాశం లేకపోలేదని ఆయన అంచనా.
కాని పక్షంలో తనకు స్పీకర్ కావాలనుందని.. మరీ ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబుతో అసెంబ్లీలో అధ్యక్షా.. అనిపించుకోవాలనుందట. ఎన్టీఆర్ ను పదవీచితుని చెయ్యడంతో చంద్రబాబుకు సహకరించారు ఆయన. అయితే ఆ తరువాత టీడీపీలో సరైన గౌరవం దక్కలేదని కాంగ్రెస్ కు వెళ్లిపోయారు. అప్పటి నుండి ఆయనకు చంద్రబాబు బద్ద శత్రువు. అందుకే స్పీకర్ అవ్వాలన్న తన చిరకాల కోరికను నెరవేర్చాలని ఇప్పటికే వైసీపీ అధిష్టానంతో తన మనసులోని మాటను బయటపెట్టారట.
ఈ ఎన్నికలు దగ్గుబాటి కుటుంబానికి చాలా కీలకం. పురంధేశ్వరి బీజేపీ తరపున పోటీ చెయ్యడంతో పెద్దగా విజయావకాశాలు లేవు. వెంకటేశ్వరరావు కూడా ఓడిపోతే రాజకీయంగా సమాధి అయిపోయినట్టే. కొడుకు రాజకీయ భవిష్యత్తు మొదలు కాకముందే ఆగిపోతుంది. దీనితో ఈ ఎన్నిక ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. హితేష్ అయితే చేతికి ఎముక లేనట్టుగా ఖర్చు పెట్టారని సమాచారం. అయితే ఈ స్థానంలో పోటీ హోరాహోరీగా ఉండే అవకాశం ఉంది. ఎవరు గెలిచినా అతికొద్ది మెజారిటీతోనే గెలుస్తారని అంటున్నారు.



