గతంలో తెలంగాణ రాష్ట్రంలో పార్టీ ఫిరాయింపు నేతలను దగ్గరుండి ప్రోత్సహించిన బిఆర్ఎస్ ఇప్పుడు దాని తాలూకా మూల్యాన్ని చెల్లిస్తుంది. నేటి రాజకీయాలలో ఓడిన పార్టీ నాయకులు నియోజవర్గ అభివృద్ధి అనే ముసుగులో గెలిచిన పార్టీలోకి జంప్ కొట్టడం సర్వ సాధారణంగా మారిపోయింది.
అయితే ఇందులో ఆ పార్టీ ఈ పార్టీ అని తేడాలేమి ఉండవు. ఓడిన పార్టీ వారు ఇది అప్రజాస్వామ్యం అంటూ గళం విప్పితారు, గెలిచిన వారు నీవు నేర్పిన విధ్యేగా నీరజాక్షా అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతారు. అయితే తాజాగా తెలంగాణ లో ఈ తరహా జుంపింగ్ నాయకుడికి హై కోర్ట్ ఊహించని షాక్ ఇచ్చిందనే చెప్పాలి.
2023 ఎన్నికలలో అప్పటి అధికార బిఆర్ఎస్ పార్టీ నుంచి ఖైరతాబాద్ ఎమ్మెల్యే గా బరిలోకి దిగిన దానం నాగేందర్ బిఆర్ఎస్ ఓటమితో 2024 మార్చిలో అధికార కాంగ్రెస్ లోకి జంప్ అయ్యారు. అలాగే 2024 ఏప్రిల్ లో కాంగ్రెస్ ఎంపీగా బరిలోకి దిగారు.
ఈ నేపథ్యంలో దానం పై విచారణ చేపట్టిన హై కోర్ట్ ఆయన పై అనర్హత వేటు వేసింది. అయితే హై కోర్ట్ ఇచ్చిన ఈ తీర్పు ఒకరకంగా అధికార పార్టీల అధిష్ఠానాలకు, పార్టీ ఫిరాయింపు నేతలకు ఒక చెంప పెట్టె లాంటిదనే చెప్పాలి.
ప్రజలు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా తమ రాజకీయ బలం పెంచుకోవడానికి, ప్రత్యర్థి పార్టీల రాజకీయ బలం తగ్గించడానికి అన్ని రాజకీయ పార్టీలు పార్టీ ఫిరాయింపు నేతలను ప్రోత్సహిస్తు రాజకీయాలలోకి ఈ విష సంస్కృతిని తీసుకొస్తున్నారు.
అయితే తాజాగా దానం ఉదంతం పై హై కోర్ట్ ఇచ్చిన తీర్పు పై బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ “సత్యమేవ జయతే” అంటూ తన X వేదిక గా స్పందించారు. కేటీఆర్ చేసిన ఈ ట్వీట్ బిఆర్ఎస్ విజయానికి సంకేతంగా చూడవచ్చు, కానీ నేడు పార్టీ ఫిరాయింపు అప్రజాస్వామ్య, అన్యాయం అంటూ న్యాయపోరాటాలు చేసిన ఇదే నేతలు రేపటి రోజున రాష్ట్రంలో తిరిగి అధికారంలోకి వస్తే ఆ విలువలను ఆచారణలో పాటించి చూపగలరా.?
నేడు సత్యమేవ జయతే అంటూ గళం విప్పిన నాయకులు రేపటి రోజున ఆ సత్యాన్ని శిరసావహించగలరా.? దానం కి పట్టినగతే పార్టీ మారిన మరో 8 మంది నేతలకు కూడా పడుతుంది అంటూ శాపాలు పెడుతున్న బిఆర్ఎస్ భవిష్యత్ లో తాము అధికారంలోకి వస్తే పార్టీ ఫిరాయింపు నేతలను ప్రోత్సహించబోము అంటూ ప్రకటించగలదా.? ఇటువంటి ప్రజలు మెచ్చే రాజకీయ మార్పులకు కేటీఆర్ బిఆర్ఎస్ నుంచి తన తొలి అడుగు వెయ్యగలరా.?





