ముఖ్యమంత్రిగా విధులు నిర్వహిస్తున్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి అకాల మరణం తర్వాత ఏపీలో ఏర్పడిన రాజకీయ సంక్షోభం అందరికీ తెలిసిందే. కాంగ్రెస్ నుండి వేరుపడిన వైఎస్సార్ తనయుడు జగన్, కొత్త పార్టీ ఏర్పాటు చేసి కాంగ్రెస్ నుండి పలువురు ఎమ్మెల్యేలను తన పార్టీలోకి చేర్చుకుని, కాంగ్రెస్ పార్టీ నిర్వీర్యం కావడానికి పరోక్షంగా కారణమైన రాజకీయ పరిస్థితులు అందరికీ విదితమే. దాదాపుగా ఇదే సీన్ ప్రస్తుతం తమిళనాడులో కూడా రిపీట్ అయ్యేలా కనపడుతోందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
ఏపీలో మాదిరిగానే ముఖ్యమంత్రిగా విధులు నిర్వహిస్తున్న సమయంలోనే జయలలిత తుది శ్వాస విడవడం, ఆ తర్వాత ‘వారసత్వ’ ప్రకంపనలు రేగడం, తెరపైకి మేనకోడలు దీప రావడం జరిగిపోయాయి. అయితే అప్పటికే రాజకీయ ఉద్దండంగా ఉన్న శశికళ, పన్నీరు సెల్వంను ముఖ్యమంత్రిని చేయడం, నిదానంగా పన్నీర్ స్థానంలోకి తానూ వచ్చే విధంగా పావులు కదుపుతుండడంతో, శశికళ నాయకత్వాన్ని సమర్ధించని నేతల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ప్రస్తుతం వారికి దీప రూపంలో ఓ ప్రత్యామ్నాయం తారసపడింది.
ఎంజీఆర్ శతజయంతి ఉత్సవాలలో భాగంగా చెన్నై మెరీనా బీచ్ కు వచ్చిన దీపా జయకుమార్, ఎంజీఆర్ సమాధి ఎదుట నిల్చుని తమిళనాడు రాజకీయాల్లోకి వచ్చేసానని ప్రకటించారు. ముఖ్యమంత్రి పీఠంపై కన్నేసిన శశికళకు ఊహించని షాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్టు దీప వర్గాలు వెల్లడిస్తున్నాయి. దీంతో తమిళనాడులో అధికారంలో ఉన్న అన్నాడీఎంకేలో చీలిక తప్పదని భావిస్తున్నారు. శశికళ నాయకత్వంపై అయిష్టత వ్యక్తపరిచే అసంతృప్త నేతలే టార్గెట్ గా శశికళ టీం పనిచేయనుందని పొలిటికల్ టాక్. ఇదిలా ఉండగా, మరో రెండు, మూడు రోజుల్లో తన కార్యాచరణ ప్రకటిస్తానని దీప ప్రకటన చేసారు.



