చిత్తూరు జిల్లా గంగాధరనెల్లూరులో మంగళవారం డిప్యూటీ సీఎం నారాయణస్వామి సంక్షేమ పథకాల అమలుపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ అసంతృప్త ఎంపీ రఘురామకృష్ణరాజు ను ఉద్దేశిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధిని అడ్డుకోవడానికి కోర్టుకు వెళ్ళేవారందరూ తన దృష్టిలో దరిద్రులేనని ఆయన అన్నారు.
కనీసం కుక్కకు ఉండే విశ్వాసం కూడా రఘురామకృష్ణరాజుకు లేదన్నారు ఆయన. రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం సీఎం జగన్ ఏది అమలు చేసినా వెంటనే మాజీ సీఎం చంద్రబాబు ప్రోద్భలంతో తెలుగుదేశం పార్టీ నాయకులు కోర్టులకు వెళ్లి అడుగడుగునా అడ్డుతగులుతున్నారని నారాయణస్వామి ఆరోపించారు.
అయితే దీనిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చజరుగుతోంది. “కోర్టుకు వెళ్ళేవారందరూ తన దృష్టిలో దరిద్రులే అన్నారు సరే మరి 2014-19 మధ్యన దరిద్రుల సంగతేంటి? ఒక్క మంగళగిరి ఎమ్మెల్యేనే అప్పట్లో పదుల సంఖ్యలో కేసులు వేశారు కదా? పైగా ఆ కేసులు వాదించిన ప్లీడర్ కు ప్రభుత్వం లో అత్యున్నత పదవి కట్టబెట్టారు కదా?,” అని కొందరు విమర్శిస్తున్నారు.
డిప్యూటీ సీఎం గారు గతం మర్చిపోయినట్టున్నారు అంటూ వారంతా ఎద్దేవా చేస్తున్నారు. “గతంలో ఏ రాష్ట్రంలోనూ ఎప్పుడూ ఏ ప్రభుత్వానికీ కోర్టులలో ఎదురుకానన్ని ఎదురుదెబ్బలు జగన్ ప్రభుత్వానికి ఈ రెండు సంవత్సరాలలో తగిలాయి. వాటిని సరిచేసుకోకుండా ఇంకొకరిని నింధిస్తే ఎవరికి నష్టం?,” అని వారు పెదవి విరుస్తున్నారు.



