ఏపీ, తెలంగాణ రాజకీయాలలో ఓ స్పష్టమైన తేడా కనిపిస్తుంది. ఏపీలో టీడీపీ నేతృత్వంలో కూటమి ప్రభుత్వం పూర్తి మెజార్టీతో పాలన సాగిస్తుంటే, తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం సుస్థిరంగా ఉన్నప్పటికీ కాళ్ళు చేతులు కట్టేసి పాలన సాగిస్తున్నట్లు కనిపిస్తుంది.
రేవంత్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కాంగ్రెస్ అధిష్టానం అనుమతి తీసుకోవలసి రావడం, కాంగ్రెస్-బీజేపిల మద్య రాజకీయ శతృత్వం కారణంగా కేంద్రం సహాయ సహకారాలు కొరవడటం, ప్రభుత్వానికి ఆర్ధిక సమస్యలు, పార్టీలో అంతర్గతంగా, బయట బిఆర్ఎస్ పార్టీ నుంచి సవాళ్ళు ఎదుర్కోవలసి రావడం వంటి అనేక సమస్యలున్నాయి.
బహుశః అందువల్లే పలు కేసులు నమోదు చేసినప్పటికీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇంతవరకు కేసీఆర్, కేటీఆర్లపై ఎటువంటి చర్యలు తీసుకోలేకపోతోందని భావించవచ్చు.
తమని రేవంత్ రెడ్డి ‘టచ్’ చేయలేకపోవడంతో వారే ఎదురుదాడి చేస్తూ ముప్పతిప్పలు పెడుతున్నారు. లగచర్ల, గచ్చిబౌలి భూముల విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నిలువరించడమే ఇందుకు తాజా నిదర్శనాలు.
ఇటువంటి అనేక కారణాల వలన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆశించిన స్థాయిలో దూసుకువెళ్ళలేకపోతోంది. కేసీఆర్ కూడా ఇది గుర్తించి, కాంగ్రెస్ పాలన పట్ల ప్రజలు తీవ్ర నిరాశ, అసహనంతో ఉన్నారని కనుక మళ్ళీ మనమే అధికారంలోకి వస్తామని అనగలుగుతున్నారు.
ఏపీలో ఇందుకు పూర్తి భిన్నమైన రాజకీయ వాతావరణం కనిపిస్తుంది. వైసీపీ హయంలో అవకతవకలకు పాల్పడినవారిపై, తమని అసభ్యంగా దూషించిన వారిపై, తమ కార్యాలయాలపై దాడులు చేసిన వైసీపీ నేతలు, సోషల్ మీడియా వారియర్స్ పై కూటమి ప్రభుత్వం కేసులు నమోదు చేయించి చట్ట ప్రకారం చర్యలు తీసుకునేందుకు గట్టిగా ప్రయత్నిస్తోంది.
అలాగే కేంద్రం సహకారం లభిస్తుండటంతో అమరావతి, పోలవరంతో సహా రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టగలుగుతోంది.
జగన్ పాలనలో నష్టాన్ని భర్తీ చేసుకుంటున్నట్లు రాష్ట్రానికి లక్షల కోట్ల పెట్టుబడులు, పరిశ్రమలు, ప్రాజెక్టులు సాధించుకోగలుగుతోంది.
వీటన్నిటినీ చూస్తున్న వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తీవ్ర అసహనానికి గురవుతూ, ‘పోలీసుల గుడ్డలూడదీయిస్తా’ నంటూ నోరు జారి ఇంకా చిక్కుల్లో పడుతున్నారు.
ఈ నేపధ్యంలో రెండు తెలుగు రాష్ట్రాలని బేరీజు వేసుకొని చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సానుకూల, తెలంగాణలో అస్తిర రాజకీయ వాతావరణం కనిపిస్తున్నాయనిపిస్తుంది.
గత పదేళ్ళుగా తెలంగాణ అన్ని రంగాలలో అభివృద్ధి సాధించి, ఇప్పుడు నత్త నడకలు నడుస్తుంటే, గత 5 ఏళ్ళుగా అభివృద్ధికి నోచుకోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ 10 నెలలలోనే శర వేగంగా అభివృద్ధి సాధిస్తుండటం స్పష్టంగా కనిపిస్తోంది.
కనుక వచ్చే ఎన్నికల నాటికి ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాల మద్య ఈ వ్యత్యాసం ఇంకా భారీగా పెరిగే అవకాశం ఉంటుంది.




