ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణించిన నాడు, ముఖ్యమంత్రి స్థానం కోసం జగన్ సంతకాల సేకరణ చేపట్టారంటూ చేసిన, చేస్తున్న హంగామా తెలియనిది కాదు. ఇప్పటివరకు ఇది మాత్రమే తెలిసింది. కానీ, సంతకాల సేకరణ మాత్రమే కాదు, మరో ఘనకార్యం కూడా చేసారంటూ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు తాజాగా సంచలన ఆరోపణలు చేసారు.
రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదానికి గురైన రోజే పోలవరం ప్రాజెక్టు టెండర్ల కోసం జగన్ ప్రయత్నించారంటూ మంత్రి ఉమామహేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా మరోసారి హాట్ టాపిక్ అయ్యాయి. అయితే కాంగ్రెస్ పెద్దలతో బేరం కుదరకపోవడంతో… ఆ టెండర్లను జగన్ దక్కించుకోలేకపోయారని అన్నారు. జగన్, విజయసాయి రెడ్డిలు పోలవరం ప్రాజెక్టుకు అడ్డంకులు సృష్టిస్తున్నారని, పనులు ఆపేందుకు కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు.
ప్రాజెక్టులపై విమర్శించే నైతికత జగన్ కు లేదని, పోలవరం ప్రాజెక్టు కోసం ఇప్పటి వరకు 12,800 కోట్లు ఖర్చు చేశామని చెప్పారు. గ్రావిటీ ద్వారా పోలవరం నీరు ప్రకాశం బ్యారేజీకి వస్తుందని తెలిపారు. 2018 నాటికి 17 వేల క్యూసెక్కుల నీటిని తరలిస్తామని చెప్పారు. జనవరి రెండో వారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీలు పోలవరం ప్రాజెక్టును సందర్శిస్తారని తెలిపారు.



