‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాలో ‘పెద్దోడు’గా నటించిన విక్టరీ వెంకటేష్ పై ఎటకారంగా మాట్లాడుతూ… ‘అట్టా వదిలేసారెంట్రా… ఎవరికైనా చూపించండ్రా…’ అంటూ సూచిస్తాడు. సరిగ్గా ఇలాగే కాకపోయినప్పటికీ, ఏపీ జలవనరుల శాఖామంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కూడా వైసీపీ వర్గీయులకు ఇలాంటి సూచనలే చేసారు. రైతు భరోసా యాత్రలో భాగంగా చంద్రబాబుపై జగన్ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఉదాహరిస్తూ ‘యువనేత’పై మండిపడ్డారు దేవినేని.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి పర్సనాలిటీ డిజార్డర్ ఉందని, ఆరోగ్యం బాగా లేదని, జగన్ ను వెంటనే ఆసుపత్రికి వెళ్లి చికిత్స తీసుకోవాలని దేవినేని సూచించారు. ఆరోగ్యం కుదుటపడేదాకా బెంగళూరుకో, ఢిల్లీకో వెళ్లి చికిత్స తీసుకుంటే మంచిదని వ్యంగంగా వ్యాఖ్యానించారు దేవినేని. అసలు రైతు భరోసా యాత్ర ఎందుకు చేస్తున్నారో జగన్ కైనా తెలుసా అని వ్యాఖ్యానించిన మంత్రివర్యులు.., చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలకు తక్షణమే జగన్ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
మరో వైపు అసలు యాత్రకే భంగం వాటిల్లే సూచనలు స్పష్టంగా కనపడుతున్నాయి. పెనుగొండ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత బీకే పార్థసారధి మాట్లాడుతూ… జగన్ పర్యటనను అడ్డుకోవాలని జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు. పార్థసారధి పిలుపుతో రోడ్డుపైకి రానున్న టీడీపీ శ్రేణులు జగన్ పర్యటనను అడ్డుకోవడం ఖాయంగానే కనపడుతోంది. ఈ క్రమంలో జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే ప్రమాదం లేకపోలేదన్న వాదన వినిపిస్తోంది. పరిస్థితిని అంచనా వేస్తున్న పోలీసులు ముందు జాగ్రత్త చర్యల కింద భారీ సంఖ్యలో బలగాలను రంగంలోకి దించారు.



