కొన్నిసార్లు సిఎం చంద్రబాబు నాయుడు చెప్పే మాటలు అతిశయోక్తిగా అనిపిస్తాయి. ఆయన మాటలు, ఆలోచనలు చాలా మందికి అర్ధం కాకపోవడం వల్లనే అలా అనిపిస్తుంది. రాష్ట్రంలో పేదరిక నిర్మూలన కోసం ఆయన చేస్తున్న పీ-4 ప్రతిపాదన కూడా అలాగే అనిపిస్తుంది.
ఈ వయసులో కూడా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంపై మక్కువ చూపుతూ దానిపై అవగాహన పెంచుకొంటూ వినియోగించుకునేందుకు ప్రయత్నించే ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే.
వర్తమాన రాజకీయ నాయకులలో చాలా దూరదృష్టితో ఆలోచించేవారిలో సిఎం చంద్రబాబు నాయుడు అగ్రస్థానంలో ఉంటారు. ఆయనేమీ జగన్లాగా మూడు రాజధానులు ఏర్పాటు చేస్తానని చెప్పడం లేదు.
ఉన్నత వర్గాలను ప్రోత్సహించి వారి సహాయ సహకారాలతో పేదలు వృద్ధిలో వచ్చేందుకు సాయపడదామని చెపుతున్నారు. దానినే సిఎం చంద్రబాబు నాయుడు పీ-4 అంటున్నారు.
సమాజంలో ఉన్నత స్థాయికి ఎదిగిన వ్యక్తికి 20-30 పరిశ్రమలు, వ్యాపారాలు ఉంటే వాటన్నిటినీ ఏవిదంగా మేనేజ్ చేసుకుంటున్నారో అదేవిదంగా ఈ పీ-4 కార్యక్రమంలో ఎంపిక చేసుకున్నపేదలను కూడా మరో కంపెనీగా భావించి వారి అభివృద్ధికి తోడ్పడమని సిఎం చంద్రబాబు నాయుడు కోరారు. ఆయన చేసిన ఈ సూచన చాలా ఆలోచింపజేస్తుంది.
సిఎం చంద్రబాబు నాయుడు జగన్లాగా సంక్షేమ పధకాల పేరుతో డబ్బులు పంచుతూ ప్రజలందరూ ఎప్పటికీ ప్రభుత్వంపై ఆధారపడాలని కోరుకోలేదు. తెలుగువారు సహజంగానే తెలివైనవారని కనుక ప్రతీ ఒక్కరికీ ఈ పీ-4 ద్వారా సహాయ సహకారాలు అందిస్తూ వారి కాళ్ళ మీద వారే నిలబడేలా చేద్దామని సిఎం చంద్రబాబు నాయుడు సూచించారు.
యువకుడైన జగన్మోహన్ రెడ్డి ఈవిదంగా ఆలోచించలేక సంక్షేమ పధకాలతో డబ్బులు పంచారు. కానీ జగన్ కంటే రెట్టింపు వయసు, అనుభవం ఉన్న సిఎం చంద్రబాబు నాయుడు ఎవరి కాళ్ళ మీద వారు నిలబది, పేరు, డబ్బు, గౌరవం సంపాదించుకోవాలని అందుకు ప్రభుత్వం, సమాజంలో ధనవంతులు అందరం తోడ్పడుదామని చెపుతున్నారు. ఒకవేళ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈవిదంగా ఆలోచించి ఉండి ఉంటే నేడు రాష్ట్రంలో ఇన్ని లక్షల మంది నిరుద్యోగ యువత ఉండేవారు కారు.. ఉద్యోగాలు దొరక్క పొట్ట చేత్తో పట్టుకొని ఇరుగు పొరుగు రాష్ట్రాలకు వలసలు పోయేవారు కారు కదా?






