తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి క్రమంగా బలహీనపడుతూ వచ్చిన కాంగ్రెస్ పార్టీ, ఈసారి శాసనసభ ఎన్నికలకు ముందు హటాత్తుగా బలపడి బిఆర్ఎస్ పార్టీకి గట్టి సవాలు విసురుతోంది. కర్ణాటక ఎన్నికలలో కాంగ్రెస్ గెలిచి అధికారంలోకి రావడం, ఆ తర్వాత బీజేపీ అధిష్టానం తెలంగాణలో తప్పటడుగులు వేయడంతో కాంగ్రెస్ పుంజుకోగలిగింది.
తెలంగాణలో టిడిపి, టిజేఎస్, వైఎస్సార్ తెలంగాణ పార్టీలు ఎన్నికల బరిలో నుంచితప్పుకొని కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించడం ఇంకా కలిసి వచ్చింది. బిఆర్ఎస్, బీజేపీల నుంచి కొందరు బలమైన నేతలు వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరారు.
తెలంగాణ కాంగ్రెస్ నేతలు నేటికీ కుమ్ములాడుకొంటున్నప్పటికీ, పార్టీని గెలిపించుకోవడానికి అందరూ చాలా శ్రమిస్తున్నారు. పైగా వారిలో చాలా మంది స్వశక్తితో తమ తమ నియోజకవర్గాలలో గెలవగల సమర్దులే. కనుక తెలంగాణ కాంగ్రెస్కు అన్నీ కలిసివచ్చిన్నట్లు స్పష్టమవుతోంది.
అయితే ఏ కర్ణాటక ఫలితాలు తెలంగాణ కాంగ్రెస్ పుంజుకోవడానికి ఉపకరించాయో, ఇప్పుడు అదే కర్ణాటక రాష్ట్రంలో, ప్రభుత్వంలో జరుగుతున్న కొన్ని అవాంఛనీయ పరిణామాలు కొంప ముంచేలా ఉన్నాయి.
కర్ణాటకలో విద్యుత్ కోతలను నిరసిస్తూ రైతులు రోడ్లెక్కి ధర్నాలు చేస్తుండగా, ప్రభుత్వం ఏర్పాటయ్యి ఆరు నెలలు కూడా కాకమునుపే అప్పుడే కొందరు మంత్రులు ముఖ్యమంత్రిని మార్చాలని డిమాండ్ చేస్తూ, ఆ పదవిని దక్కించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.
కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కుమారుడు, కర్ణాటక ఐటి శాఖ మంత్రి ప్రియాంక ఖర్గే “అధిష్టానం ఆదేశిస్తే నేను ముఖ్యమంత్రి పదవి చేపడతానని” చెప్పారు. హోంమంత్రి జి. పరమేశ్వర తాను కూడా ముఖ్యమంత్రి రేసులో ఉన్నానని ప్రకటించారు. ఇంకా మరికొందరు మంత్రులు కూడా ముఖ్యమంత్రి పదవికి పోటీ పడుతున్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తెలంగాణ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలా మారిపోతుందని, ప్రతీ ఆరు నెలలకీ ఓ ముఖ్యమంత్రి మారుతూనే ఉంటారని తెలంగాణ మంత్రులు ఇదివరకే చెప్పారు. ఇప్పుడు కర్ణాటకలో అదే జరుగుతోంది.
కనుక తెలంగాణకు అటువంటి కాంగ్రెస్ పార్టీ అవసరమా? అని బిఆర్ఎస్ నేతలు ప్రజలను ప్రశ్నిస్తున్నారు. ఈ వాదనలతో తెలంగాణ ప్రజలు ఏకీభవిస్తే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని మరోసారి ఓడించడం ఖాయమనే భావించవచ్చు.
కనుక కాంగ్రెస్ అధిష్టానం అత్యవసరంగా కర్ణాటక కాంగ్రెస్లో పరిస్థితులను చక్కదిద్ది అందరి నోళ్ళకు తాళాలు వేయవలసి ఉంటుంది. లేకుంటే ఈసారి కర్ణాటక కారణంగానే ఎన్నికలలో ఓడిపోవచ్చు.






