అవును… మీరు చదువుతున్నది నిజమే… ప్రిన్స్ మహేష్ బాబు నటించే 25వ సినిమాకు దర్శకత్వం వహించే అరుదైన అవకాశం లభించిన డైరెక్టర్ వంశీ పైడిపల్లిని పట్టుకుని, ‘ఎదవ’ అని తిట్టేసారు సుకుమార్. అదొక్కటే కాదు ఇలాంటి తిట్లు చాలా తిట్టానని స్వయంగా సుకుమారే సెలవిచ్చారు. ఇన్ని తిట్లు ఎందుకు తిట్టారో కూడా చెప్పుకొచ్చారు. తాజాగా జరిగిన “దర్శకుడు” సినిమా ఆడియో వేడుక మీద చోటు చేసుకున్న సరదా సంఘటనలో భాగం ఇది.
‘తనకు ఆర్య సినిమా నుండి పరిచయం ఉన్న వ్యక్తి వంశీ అని, అప్పట్లో తాను, నిర్మాత దిల్ రాజు బాగా క్లోజ్ గా ఉన్న తరుణంలో వంశీ మధ్యలో దూరాడని, అప్పటి నుండి ప్రారంభమైన ఈర్ష్య గతేడాది విడుదలైన “ఊపిరి” సినిమా వరకు కొనసాగుతూనే ఉందని, ఆ సినిమా చూసి, వెంటనే ఫోన్ చేసి తిట్టేసానని, ఎదవ… ఇలాంటి మంచి సినిమా ఎలా తీసావురా… అంటూ చాలా తిట్లు తిట్టానని, అంత అనుబంధం తమ మధ్య ఉందని’ సరదాగా చెప్పుకొచ్చారు సుకుమార్.
ఇక వంశీ పైడిపల్లి మాట్లాడుతూ… “రంగస్థలం”లో ఒక పాట తనకు సుక్కూ వినిపించాడని, అదిరిపోయింది, సినిమా కోసం వేచిచూడలేను అంటూ చెర్రీ, సుకుమార్ ల గురించి చెప్పుకొచ్చారు. ఇదే వేదికపై ప్రసంగించిన మరో దర్శకుడు సురేందర్ రెడ్డి గురించి మాట్లాడుతూ… ఇటీవలే ‘ఊయ్యాలవాడ నరసింహారెడ్డి’ సినిమా కధ సురేందర్ చెప్తుంటే విన్నానని, సురేందర్ రెడ్డి చెప్తుంటే రోమాలు నిక్కపోడుచుకున్నాయని, అంత బాగా చెప్తాడని, ఈ సినిమా ద్వారా మంచి విజయం అందుకుంటున్నాడని కితాబిచ్చాడు సుక్కూ.



