టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుని జగన్ ప్రభుత్వం అరెస్ట్ చేసి జైల్లో నిర్బందించినప్పుడే జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, బ్రాహ్మణి, భువనేశ్వరిలతో సహా టిడిపి నేతలందరూ ఆయన భద్రత గురించి ఆందోళన వ్యక్తం చేశారు.
ఇప్పుడు చంద్రబాబు నాయుడే స్వయంగా తన భద్రతపై సందేహాలు వ్యక్తం చేస్తూ ఏసీబీ కోర్టు న్యాయమూర్తికి లేఖ వ్రాశారు. దానిని కూడా వైసీపి నేతలు పరిహసించినా ఆశ్చర్యం లేదు. కానీ వైసీపి హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ (అవును ఆయనే) బహిరంగంగానే “2024 ఎన్నికలలో జగన్ మళ్ళీ గెలిచి అధికారంలోకి రావడం, చంద్రబాబు నాయుడు చావడం రెండూ ఖాయమే,” అని చెప్పేశారు. వైసీపి నేతల మనసులో మాటనే ఆయన చెప్పారని అర్దమవుతోంది.
గతంలో కూడా ఓ వైసీపి నేత తాము చంద్రబాబు నాయుడుని చంపాలనుకొంటే ఎప్పుడో చంపించేసేవారమని నోరు జారారు. చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులే ఆయనకు పంపించే భోజనంలోనే విషం కలిపి చంపేసి వైసీపిపై నెట్టినా ఆశ్చర్యం లేదని మరో వైసీపి నేత ఆరోపించిన సంగతి తెలిసిందే. వైసీపి నేతల మనసులో ఇటువంటి ఆలోచనలు ఉన్నందునే అవి వారి మాటలలో బయటపడుతున్నాయని భావించవచ్చు.
ముఖ్యమంత్రి సొంత బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డి 2019 ఎన్నికల సమయంలోనే అతికిరాతకంగా హత్య చేయబడటం, ఆ కేసులో వైసీపి ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డితో సహా పలువురు వైసీపి నేతలే అరెస్ట్ చేయబడిన సంగతి అందరికీ తెలిసిందే.
వైఎస్ కుటుంబానికే చెందిన వివేకానంద రెడ్డే హత్య చేయబడినప్పుడు, రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబు నాయుడు ప్రాణానికి భరోసా ఉంటుందా?భద్రత ఉంటుందా?అంటే ఉండదనే అర్దమవుతోంది.
అందుకే జైల్లో ఉన్న చంద్రబాబు నాయుడు, బయట ఉన్న ఆయన కుటుంబ సభ్యులు, టిడిపి నేతలు ఆందోళన చెందుతున్నట్లు భావించవచ్చు. కనుక చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, భువనేశ్వరి, టిడిపి నేతల భయాలను తేలికగా కొట్టిపడేయలేము. రాజకీయ జిమ్మిక్కుగా పరిగణించలేము.
కేంద్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడుకి జడ్ ప్లస్ భద్రత కల్పించింది. కానీ కరడుగట్టిన నేరస్తులున్న రాజమండ్రి సెంట్రల్ జైల్లో అసలు భద్రతే లేదని చంద్రబాబు నాయుడు స్వయంగా కోర్టుకి తెలియజేశారు. చంద్రబాబు నాయుడుతో సహా అందరూ ఇంతగా చెపుతున్నా వైసీపి ప్రభుత్వం స్పందించకపోవడం ఆశ్చర్యం కలిగించదు కానీ కేంద్ర ప్రభుత్వం కూడా ఆయన భద్రతపై స్పందించకపోవడమే చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. జెడ్ ప్లస్ భద్రతలో ఉండవలసిన చంద్రబాబు నాయుడు జైల్లో భద్రత లేకుండా ఉండటం చాలా ఆందోళనకరమైన విషయమే.




