జగన్ చిన్న పిల్లోడు, సౌమ్యుడు, చాలా మంచివాడు అంటూ తన పార్టీలో ఎవరెవరిని సర్టిఫై చేశారో వారందరూ మంచి ‘కళాపోషకులే’ అని నిరూపించుకున్నారు. అలా జగన్ చేత సర్టిఫై చేయబడిన వైసీపి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కూడా ఎంతటి రసికుడో బయటపడింది.
తనకు ఇద్దరు కూతుర్లు ఉన్నారని వారిలో ఒకరికి పెళ్ళి చేశానని, మరొకమ్మాయికి పెళ్ళి చేయాల్సి ఉందని దువ్వాడ స్వయంగా చెప్పారు. ఇంట్లో భార్య, పెళ్ళి కావలసిన మరో కూతురు ఉండగా, దువ్వాడ వైసీకే చెందిన దివ్వెల మాధురితో సెకండ్ సెటప్ చేసుకోవడంతో వైసీపిలో మరో రసికరాజు ఉద్భవించిన్నట్లయింది.
శుక్రవారం రాత్రి ఆయన భార్య, కూతురు ‘రెండో బ్రాంచి’ వద్దకు వెళ్ళి నిలదీసినప్పుడు ఆయన వారిని బూతులు తిడుతూ, అక్కడే ఉన్న గ్రానైట్ పలకతో కొట్టబోతే పోలీసులు అడ్డు పడ్డారు. సార్ తీరు ఈవిదంగా ఉంటే మేడమ్ మాధురి కూడా ఆయనకు ఏ మాత్రం తీసిపోనని నిరూపించుకున్నారు.
ఆమె మీడియాతో మాట్లాడుతూ, “ఆయనకు కుటుంబం ఉంది. నాకూ కుటుంబం ఉంది. ఇద్దరం ఇంకా విడాకులు తీసుకోకపోవడం వలన పెళ్ళి చేసుకోవడం చట్టవిరుద్దమని చేసుకోలేదు. మేము సహజీవనం చేస్తున్నామనడం కూడా తప్పు. పరస్పర అంగీకారంతో లైంగిక సంబంధం కలిగి ఉన్నాము. ఇది తప్పు ఎలా అవుతుంది? ఆయన నన్ను ఉంచుకుని నాకు అండగా ఉన్నారు,” అని ఎటువంటి దాపరికం లేకుండా అసలు విషయం చెప్పేశారు.
జగన్ సర్టిఫైడ్ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కూడా నేడు ప్రెస్మీట్ పెట్టి ఒకటీ రెండూ కాదు చాలా కుండలు బద్దలు కొట్టేశారు. తన భార్య గయ్యాళి, డబ్బు, పదవీ కాంక్ష చాలా ఎక్కువని చెప్పారు. తాను సంపాదించినంత ఆమె చేతిలో పెడుతున్నా తనను మానసికంగా చాలా హింసించేదన్నారు. ఆమె ఒత్తిడి భరించలేక జగన్కు నచ్చజెప్పి ఆమెకే ఎమ్మెల్యే టికెట్ ఇప్పించానని చెప్పారు.
తాను ఇద్దరు కూతుర్లను చాలా ప్రేమగా చూసుకొని చదివించానని, పెద్ద కూతురుకి పెళ్ళి చేశానని, రెండో కూతురికి కూడా చేద్దామనుకుంటుంటే ఈ రాద్దాంతంతో తమ కుటుంబం పరువు బజారున పడిందని దువ్వాడ శ్రీనివాస్ చెప్పారు.
తన భార్య గయ్యాళి కానీ మాధురి చాలా సాంప్రదాయమైన కుటుంబం నుంచి వచ్చిందని చాలా మంచి అమ్మాయని దువ్వాడ శ్రీనివాస్ సర్టిఫై చేశారు. ఇక తన భార్యతో కాపురం చేయలేనని త్వరలో విడాకులు తీసుకుంటానని చివరి కుండని కూడా బద్దలు కొట్టేశారు.
ఓ గోరంట్ల, ఓ అంబటి, ఓ అవంతి, ఓ విజయసాయి, ఓ దువ్వాడ, ఓ అనంతబాబు, ఓ చిన్న పిల్లోడు… ఇన్ని ఆణిముత్యాలతో వైసీపి కళకళలాడుతుండటం చాలా సంతోషం.




