గడిచిన రెండు ఐపీఎల్ సీజన్లలో రిషబ్ పంత్ ఎదురుకున్నంత నెగటివ్ కామెంట్స్ మరే ఇతర భారత క్రికెటర్ ఎదుర్కొని ఉండరు. 27 కోట్లు పారితోషకం తీసుకుంటూ వరుసగా రెండు సీజన్లలో జట్టును కనీసం ప్లే-ఆఫ్స్ కు కూడా తీసుకురాలేకపోయాడు. ఇటు బ్యాటర్ గానూ, అటు కెప్టెన్ గానూ ఘోరంగా విఫలమయిన పంత్ మీద ఆ జట్టు మాత్రం ఇంకా నమ్మకం కోల్పోలేదు..!
ప్రతి రెండేళ్లకు ఒకసారి మేనేజ్మెంట్ లో మార్పు జరిగే ఢిల్లీ కాపిటల్స్ జట్టు మరో రెండేళ్లపాటు జె.ఎస్.డబ్ల్యూ సంస్థ ఆధ్వర్యంలో నడవనుంది. ఐపీఎల్ లో సుమారు గత దశాబ్ద కాలం నుండి పంత్ కు జె.ఎస్.డబ్ల్యూ సంస్థకు మంచి సంబంధాలు ఉన్నట్టు అందరికి తెలిసిందే. రిషబ్ పంత్ ను ఫుల్-టైం కెప్టెన్ గా నియమించిన మేనేజ్మెంట్ కూడా జె.ఎస్.డబ్ల్యూ కాలంలోనే జరిగింది.
అయితే ఈసారి, కుల్దీప్ యాదవ్ను రిషభ్ పంత్ కోసం ట్రేడ్ చేసింది ఢిల్లీ కాపిటల్స్ జట్టు. ఈ ట్రేడ్ ద్వారా పంత్ ను తిరిగి జట్టులోకి తీసుకురావడం వెనుక భావోద్వేగంతో పాటు వ్యూహాత్మక ఆలోచన కూడా కనిపిస్తోంది. పంత్ సామర్థ్యాలపై వారికి ఇప్పటికీ పూర్తి నమ్మకం ఉందనే సంకేతాన్ని ఈ నిర్ణయం ఇచ్చింది. గత కొన్ని సీజన్ల ఘోర పెర్ఫామెన్స్ ను పట్టుకుని కూర్చోకుండా, తాము ఫ్యూచర్ ను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు అర్ధమవుతుంది.
ఈ ఒప్పందం సాఫీగా జరగడానికి పంత్ కూడా కీలక పాత్ర పోషించాడు. ఏకంగా రూ.27 కోట్ల జీతం నుంచి రూ.15 కోట్లకు తగ్గించుకోవడానికి ఆయన అంగీకరించాడు. ఎక్స్ జట్టు లోకి తిరిగిరావాలనే పంత్ గట్టి కోరిక, యాజమన్యంతో తనకు ఉన్న మంచి అనుబంధం ఈ ట్రేడ్ సక్సెస్ అయ్యేందుకు దోహద పడ్డాయి.
ఢిల్లీ క్యాపిటల్స్లో ప్రస్తుతం భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వచ్చే రెండేళ్ల పాటు జట్టు జేఎస్డబ్ల్యూ గ్రూప్ ఆధీనంలో నడవనుంది. ఫ్రాంచైజీ భవిష్యత్తుకు సంబంధించిన నిర్ణయాల్లో కూడా వారి పాత్ర కీలకంగా ఉండనుంది. ఈ నేపథ్యంలో పంత్ పునరాగమనం ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకుంది.
ఈ ట్రేడ్ కేవలం ఆటగాళ్ల మార్పిడి మాత్రమే కాదు, భవిష్యత్తుపై పెట్టుబడిగా కూడా చూడవచ్చు. కుల్దీప్ యాదవ్ లాంటి నాణ్యమైన బౌలర్ను వదులుకోవడం చిన్న విషయం కాదు. అయినప్పటికీ పంత్ ప్రభావం జట్టుకు మరింత ఉపయోగపడుతుందని ఫ్రాంచైజీ భావించినట్లు తెలుస్తోంది. అందుకే ఈ సాహసోపేత నిర్ణయం తీసుకుంది.
ఇప్పటికే జట్టులో ఉన్న రాహుల్, అక్షర్, ముకేశ్ కుమార్ వంటి సీనియర్ ఆటగాళ్లు ఉన్న ఢిల్లీ జట్టుకు ఇప్పుడు పంత్ రాక మరింత బలాన్ని చేకూరుస్తుంది. కుల్దీప్ యాదవ్ తమను అనేక సార్లు అనేక మ్యాచ్లలో ఆదుకున్నప్పటికీ, పంత్ కోసం కుల్దీప్ ను ఒదులుకోకతప్పలేదు యాజమాన్యానికి. పైగా, 15కోట్ల పారితోషకంతో వస్తున్న పంత్ పై ఇకనుండి సాలరీ-బర్డెన్ ఉండబోదు, కనుక పంత్ న్యాచురల్ గేమ్ ను చూసేందుకు అవకాశాలు ఎక్కువగా ఉండనున్నాయి.
ఇప్పుడు అందరి చూపు రిషభ్ పంత్పైనే ఉంది. తనపై ఢిల్లీ యాజమాన్యం ఉంచిన ఈ నమ్మకాన్ని మైదానంలో పంత్ ఎలా నిలబెట్టుకుంటాడో చూడాలి. గత వైఫల్యాలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూడా అతడిపైనే ఉంది. ఒకవేళ పంత్ మళ్లీ తన పాత ఫామ్ను అందుకుంటే, ఈ ట్రేడ్ ఐపీఎల్ చరిత్రలో అత్యంత తెలివైన నిర్ణయాల్లో ఒకటిగా నిలిచిపోవచ్చు.




