వివిద కేసులలో కొందరు వైసీపీ నేతలు ముందస్తు బెయిల్ కోసం కోర్టుల చుట్టూ, విచారణ కోసం పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతుంటే మరికొందరు వరుసగా జైళ్ళకు వెళుతున్నారు. ఈ క్యూలైన్లో ఇంకా చాలా మందే ఉన్నారు. కనుక ఓ కేసులో ఏ-1, ఏ-2లు ముందుగా లోపలకు వెళితే ఏ-3 ఆ పైనున్నవారు తమ వంతు కోసం ఎదురు చూస్తున్నారనుకోవచ్చు.
మద్యం కుంభకోణంలో ఇప్పటికే వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని, మాజీ ఎంపీ విజయసాయి రెడ్డిలని ప్రశ్నించారు. ఈ కేసులో విజయసాయి రెడ్డి పేరు కూడా వినిపిస్తున్నప్పటికీ ఆయన అప్రూవరుగా మారి, మిగిలినవారి బట్టలు విప్పిస్తానని మంగమ్మ శపధం చేశారు. ఆ ప్రకారమే మొదట కసిరెడ్డిని లోనికి పంపించారు. తర్వాత మిథున్ రెడ్డి వంతు రావచ్చు.
పల్నాడు జిల్లా యడ్లపాడు మండలం విశ్వనాధుని కండ్రిక గ్రామంలో శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ యజమానిని బెదిరించి రూ.2.20 కోట్లు బలవంతంగా వసూలు చేసినందుకు మాజీ మంత్రి విడదల రజనీ, ఆమె మరిది గోపీ తదితరులపై కేసు నమోదైన సంగతి తెలిసిందే.
ఈ కేసులో గోపీని పోలీసులు హైదరాబాద్లో అరెస్ట్ చేసి విజయవాడ తీసుకువస్తున్నారు. కనుక ఆయనని లోపలకు పంపిన తర్వాత రజని ఎపిసోడ్ మొదలవుతుందేమో?
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రెండు నెలలుగా జైలులో విశ్రాంతి తీసుకుంటుండగా, బాలీవుడ్ నటి కాదంబరి కేసులో మాజీ ఇంటలిజన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు కూడా మే 7వరకు విజయవాడ సబ్ జైలులో విశ్రాంతి తీసుకుంటున్నారు.
ఎవరికీ భయపడని గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నానికి బహుశః ఈ కేసులని చూసి భయపడ్డారో ఏమో గుండెపోటు తెచ్చుకొని బైపాస్ సర్జరీ చేయించుకొని ముంబయి హాస్పిటల్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. కనుక టీడీపీలో అభిమానులు ఆయన కోసం ఆతృతగా ఎదురు చూస్తూనే ఉన్నారు.
ఓ వంశ చరిత్ర, ఆ వంశంలో కుటుంబ సభ్యుల గురించి తెలుసుకోవడానికి వంశ వృక్షం రూపొందించుకున్నట్లే, వైసీపీ నేతల కేసులకీ ‘ఎక్స్ఎల్ షీట్’ రూపొందించుకుంటే తప్ప అర్దం చేసుకోవడానికి చాలా గందరగోళంగా ఉంటుంది. ఒకవేళ వీటి కోసం ‘ఎక్స్ఎల్ షీట్’ పెడితే దానిలో ముందుగా వారి అధినేత జగన్మోహన్ రెడ్డి పేరు వ్రాయవలసి వస్తుంది. ప్రతీ కేసు మూలాలలోకి వెళితే బహుశః అక్కడ జగన్ పేరే కనిపిస్తుంటుంది కదా?




