ఏపీ ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రెవెన్యూ వృద్ధి రేటు సంవత్సరానికి సుమారుగా 6 శాతం పెరుగుతూ వచ్చింది. అలాగే వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత సంవత్సరం నుండి సంవత్సరానికి 16 .7 శాతం వృద్ధి రేటు పెరిగిందంటూ గణాంకాలు చెప్పుకొచ్చారు.
కరోనా మహమ్మారిని తట్టుకుంటూ వైసీపీ ప్రభుత్వం రాష్ట్రానికి ఆదాయాన్ని పెంచుకుంటూ వెళ్తుందని బాగానే కవర్ చేశారు బుగ్గన. అయితే ఈ వృద్ధి మాట సరేకాని రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజలపై మోపిన పన్నుల భారాన్ని,పెరిగిన నిత్యవసరాల ధరలను కూడా గత ప్రభుత్వం హయాంలో పోల్చి అప్పుడు సమాధానం చెప్పాలంటూ సామాన్య ప్రజలే ఆర్థిక మంత్రికి లెక్కలు బోధిస్తున్నారు.
గత ప్రభుత్వంలో చెత్త పన్ను, మరుగు దొడ్ల పన్ను లేదు, కరెంట్ బిల్లు ఈ స్థాయిలో పెరగలేదు,ఆస్తి పన్ను దాదాపుగా మూడు నాలుగు రేట్లు పెరిగింది,మద్యం ధరల సంగతి అయితే ఇక ఆకాశాన్ని తాకాయనే చెప్పాలి.నిత్యావసర సరుకుల ధరలు సామాన్యుడికి అందుబాటులో ఉండడం లేదు.పెట్రోల్ మీద స్టేట్ టాక్స్ ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో ఎక్కువే,రోడ్లు లేని రాష్ట్రంగా పక్కరాష్ట్రాలు సైతం అవహేళన చేస్తుంటే ఏపీలో రోడ్ సెస్ అంటూ ప్రత్యేక టాక్స్ విధించారు.వాహనాల పై ప్రభుత్వ అధికారుల చలానాలు కూడా గత ప్రభుత్వంతో పోలిస్తే ప్రస్తుత గవెర్నమెంట్ లో ఎక్కువయ్యాయనే చెప్పాలి.
ఇలా ప్రజలనుండి గత ప్రభుత్వంతో పోలిస్తే ఈ ప్రభుత్వం వసూలు చేస్తున్న పన్నులు కూడా దాదాపుగా పది శాతం పైనే పెరిగాయి. టాక్సులు పెరిగితే ఆదాయం పెరిగేది ప్రభుత్వానికి కానీ సామాన్యుడికి కాదు కదా. ఇలా ప్రజల మీద మోయలేని భారం వేసి ప్రభుత్వానికి ఆదాయం పెరిగిందంటూ గొప్పలు చెప్పే ఆర్థిక మంత్రికి ముందు ఈ రాష్ట్రంలో ప్రజల జీవనప్రమాణాలు ఎలాఉన్నాయో ఒక్కసారి గమనించుకుంటే ఇలా గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం అంటూ మాటల గారడీ కానీ అంకెల గారడీ కానీ చేయాల్సిన అవసరం రాకపోవచ్చు.




