ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా స్త్రీశక్తి, మహాలక్ష్మి పధకాలు ప్రవేశపెట్టి విజయవంతంగా అమలుచేస్తున్నాయి.
ఈ పధకం వలన రెండు రాష్ట్రాలలో మహిళలు చేతిలో రూపాయి లేకున్నా ధైర్యంగా బస్సు ఎక్కగలుగుతున్నారు. ఉచితంగా ప్రయాణిస్తున్నారు. నిరుద్యోగులు, చిరుద్యోగులు, విద్యార్ధినులు, రోజువారి కూలీలు, నిరుపేద మహిళలకు ఈ పధకం నిజంగా గొప్ప వరమనే చెప్పాలి. వీటి ద్వారా రెండు రాష్ట్రాలలో ఏటా లక్షల మంది మహిళలు ఉచితంగా బస్సు ప్రయాణాలు చేయగలుగుతున్నారు.
అయితే ఈ పధకం వల్ల పురుషులతో పాటు మహిళలు కూడా ఇబ్బందిపడుతున్నారంటే నమ్మశక్యంగా ఉండదు. కానీ ఇదే వాస్తవం.
ఈ పధకం మొదలైనప్పటి నుంచి మహిళలతో బస్సులన్నీ కిటకిటలాడుతున్నాయి. కనుక టికెట్ కొని ప్రయాణించే పురుషులకు బస్సులో చోటు ఉండటం లేదు.
ఈ రద్దీ కారణంగా పేద మహిళలు సైతం ముఖ్యంగా.. 40 కిమీలు అంత కంటే ఎక్కువ దూరం ప్రయాణించాల్సిన మహిళలు సీట్లు దొరక్క, అంత దూరం నిలబడి ప్రయాణం చేయలేక నానా అవస్థలు పడుతున్నారు.
ఈ రద్దీ కారణంగా పురుషులతో పాటు పలువురు మహిళలు, కూడా ఈ పధకం వర్తించని బస్సులలో టికెట్లు కొని ప్రయాణిస్తున్నారు. ఈ పధకాలు మొదలైనప్పటి నుంచి పిల్లలు, పిల్లలతో ప్రయాణించే తల్లి తండ్రులు, వృద్ధులు, అనారోగ్యంతో బాధపడుతున్నవారు చాలా ఇబ్బందిపడుతున్నారు.
దీంతో మిగిలిన బస్సులు కూడా కిటకిటలాడుతున్నాయి. ఆర్టీసీ బస్సులలో టికెట్ కొన్నా నిలబడేందుకు కూడా చోటు ఉండకపోవడంతో పురుషులతో పాటు మహిళలలు కూడా షేరింగ్ ఆటోలు, క్యాబ్లు, ర్యాపిడో వంటి వాటిని ఆశ్రయిస్తున్నారు. దీంతో వారు ఇష్టారాజ్యంగా ప్రయాణికులను దోచుకుంటున్నారు.
రెండు ప్రభుత్వాలు ఈ పధకాలు గురించి అవకాశం దొరికినప్పుడల్లా గొప్పలు చెప్పుకుంటాయి తప్పితే సామాన్య ప్రజలు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? ఏవిధంగా దోపిడీకి గురవుతున్నారు? ఈ సమస్యలకు పరిష్కారం ఏమిటి? అని క్షేత్రస్థాయిలో పర్యటించి తెలుసుకునేందుకు ప్రయత్నించరు.
ఎందుకంటే వారికి సామాన్య ప్రజల కష్టాలు తెలియవు. తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు. తాంబూలాలు ఇచ్చేశాం తన్నుకు చావండి అంటే ఇదే కదా?




