టీడీపి ఎన్నికల హామీలలో మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడం కూడా ఒకటి. ఈ హామీని అమలుచేయకుండా కూటమి ప్రభుత్వం మహిళలను మోసం చేస్తోందని వైసీపీ ఎంతగా దుష్ప్రచారం చేస్తున్నప్పటికీ, సిఎం చంద్రబాబు నాయుడు ఏమాత్రం తొందరపడలేదు.
ఇటువంటి పధకాన్ని ఇప్పటికే అమలు చేస్తున్న తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు అధికారులను పంపించి, దాని సాధక బాధకాలపై లోతుగా అధ్యయనం చేయించిన తర్వాత వచ్చే నెల (ఆగస్ట్) 15 నుంచి అమలు చేయబోతున్నట్లు ప్రకటించారు.
ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు సోమవారం అధికారులతో సమావేశమయ్యి ఈ పధకం గురించి చర్చించారు. మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తూనే, వారు ఎంత రాయితీ పొందుతున్నారో తెలియజేసేందుకు టికెట్ ధరను కూడా సూచించారు.
ఈ పధకం అమలు చేయడం ఖాయమని స్పష్టమైంది. కానీ ఇదివరకు ఒకరిద్దరు మంత్రులు ఈ పధకం కేవలం జిల్లా సరిహద్దుల వరకు మాత్రమే పరిమితమని చెప్పారు. ఈ పధకం వలన ఆర్టీసీపై చాలా ఆర్దికభారం పడుతుంది. దీనిని ప్రభుత్వమే భరించాల్సి ఉంటుంది. కనుక ఆ భారం తగ్గించుకునేందుకు జిల్లా సరిహద్దుల వరకు ఉచిత ప్రయాణం పరిమితం చేయాలనుకొని ఉండవచ్చు.
కానీ ఇంతకాలం ఈ పధకం అమలుచేయలేదంటూ విమర్శలు గుప్పిస్తున్న వైసీపీకి, ఈవిదంగా కొన్ని పరిమితులతో ఈ పధకం అమలుచేసినా ప్రభుత్వాన్ని విమర్శించేందుకు అవకాశం కల్పించినట్లే అవుతుంది. త్వరలో దీని విధివిధానాలు ప్రకటిస్తే ప్రభుత్వం ఈ పధకాన్ని ఏవిదంగా అమలు చేయబోతోందనే దానిపై పూర్తి స్పష్టత వస్తుంది.




