నేటి రాజకీయ చరంగంలో రాజకీయ పార్టీలు ప్రజల మెప్పుని పొందాలంటే ఉన్న ఏకైక మార్గం ఉచిత పథకాల హామీలు. వీటి వలన ఒక వర్గం ప్రజలకు మేలు కలిగినప్పటికీ రాష్ట్రానికి, దేశానికి, భవిష్యత్ తరానికి అవి ముప్పుగా మారే ప్రమాదం లేకపోలేదు.
జేబులో ఉన్న డబ్బుకన్నా ఎక్కువ బడ్జెట్ తో జీవితం గడపాలని ఆశిస్తే ఏమవుతుంది? అప్పుల ఊబిలో పడి అటు పైకి రాలేక ఇటు ఒక్కోఅడుగు కిందకు పోతూ జీవితాన్నే పణంగా పెట్టాల్సి వస్తుంది. ఇప్పుడు అధికారం అందిపుచ్చుకున్న ప్రభుత్వాలు, అధికారం కోసం ఆరాటపడుతున్న ప్రతిపక్షాలు అన్ని ఏ పార్టీకి చెందినవి అయినా కేంద్ర నుండి రాష్ట్రాల వరకు ఈ ఉచిత పథకాల ఫార్ములానే నమ్ముకుని రాజకీయాలు నడుపుతున్నాయి.
ఇప్పుడు వీటి మీదే గరికపాటి గారు ప్రజలను మేల్కొల్పడానికి తనవంతుగా కొన్ని సూచనలు చేశారు. ప్రభుత్వాలు ఇచ్చే ఉచిత పథకాలతో ప్రజల తలరాతలు మారవని, వాటి వలన రాష్ట్రాలు అభివృద్ధి చెందవని చెప్పుకొచ్చారు. ఈ ఉచిత పథకాలు క్రమక్రంగా తన పరిధిని పెంచుకుంటూ దేశమంతా విస్తరిస్తున్నాయంటూ ఆందోళన చెందారు. ఈ ఉచిత పథకాల మాయలో పడొద్దని ప్రజలను చైతన్య పరిచారు. ఎన్నికలలో నిలబడిన నిజాయితీ వ్యక్తులనే ప్రజలు తమ ఓటుతో రాజకీయాలలో ప్రోత్సహించాలంటూ గరికపాటి రాజకీయ ప్రవచనాలు చేశారు.
‘చెప్పడానికి సులువుగా, వినడానికి ఇంపుగా” ఉన్నప్పటికీ ఈ ప్రవచనాలను ఆచరించే నాధుడు ప్రపంచంలోనే లేడనే సత్యాన్ని గరికపాటి గారు గుర్తించాలి. ఈ విషయం ఆయనకు తెలియనిది కాకపోయినప్పటికీ తనవంతు ధర్మంగా పెద్దరికంతో ప్రజలకు కొన్ని సూచనలు చేసుండవచ్చు. ‘కోడి ముందా..గుడ్డు ముందా..!’ అనే సామెత మాదిరి ‘ముందు మారాల్సింది రాజకీయ పార్టీలా…ఓటర్ లా…’ అనే మీమాంసలోనే కొన్ని ప్రభుత్వాలు మారిపోయాయి. ఇప్పటికి సమాధానము మాత్రం చిక్కలేదు.ఇక ముందు చిక్కదు కూడా.




