సినీ అభిమానులకు ఈ సంక్రాంతి పండగ ఇచ్చినంత ‘కిక్’ ఇటీవల కాలంలో మరే పండగ ఇవ్వలేదనే చెప్పాలి. దానికి కారణం కూడా తెలిసిందే. ఇంత పోటీతత్వంతో బరిలోకి దిగిన చిరు, బాలయ్య వంటి రెండు పెద్ద సినిమాలతో పాటు శర్వానంద్ ‘శతమానం భవతి’ కూడా విడుదలైంది. మూడు సినిమాల ఫలితాలు వచ్చేసాయి. ఇంతకీ ఏ సినిమా ఆధిపత్యం చలాయిస్తోంది? బాక్సాఫీస్ వద్ద ఏ హీరో తన జెండాను ఎగురవేసాడు? అన్నది సినీ ప్రేక్షకులకు ఆసక్తికరంగా మారింది.
పదేళ్ళ రీ ఎంట్రీ ఇచ్చిన చిరంజీవా? చారిత్రాత్మక కధతో వచ్చిన బాలకృష్ణనా? సైలెంట్ గా విడుదల చేసిన శర్వనందా? 2017 సంక్రాంతి “విజేత” ఎవరు అన్న ప్రశ్నకు సమాధానం లభించింది. తెలుగువాడి, వాడి, వేడిని చూపించి ప్రేక్షకుల నుండి అదిరిపోయే టాక్ ను సొంతం చేసుకున్న “గౌతమీపుత్ర శాతకర్ణి” ఈ సంక్రాంతి విజేతగా జెండా ఎగురవేసినట్లుగా ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. బాక్సాఫీస్ వద్ద స్టడీ కలెక్షన్స్ తో పాటు విమర్శకుల నుండి, ప్రేక్షకుల నుండి అద్భుతమైన టాక్ ను సొంతం చేసుకోవడం… ఈ మూడు సినిమాలలో ఒక్క ‘శాతకర్ణి’కి మాత్రమే వశమైంది.
ప్రేక్షకుల మౌత్ టాక్ ను పరిశీలిస్తే… నెంబర్ 1 స్థానంలో “గౌతమీపుత్ర శాతకర్ణి” ఉండగా, రెండవ స్థానంలో ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన శర్వానంద్ “శతమానం భవతి” నిలిచింది. ఓ రీమేక్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మెగాస్టార్ కు చివరి స్థానాన్నే ఇచ్చారు సినీ అభిమానులు. అయితే ఓవరాల్ కలెక్షన్స్ పరంగా చూసుకుంటే… అందరి కంటే ముందు వచ్చిన చిరు ‘ఖైదీ నంబర్ 150’ అగ్ర స్థానాన్ని దక్కించుకుంది. ఆ తర్వాత బాలయ్య, శర్వానంద్ లు నిలిచారు.
మెగాస్టార్ పదేళ్ళ తర్వాత రీ ఎంట్రీ ఇవ్వడమనేది తొలిరోజు వసూళ్ళను శాసించాయనే చెప్పాలి. కానీ ఫస్ట్ డే తర్వాత భారీగా కలెక్షన్స్ డ్రాప్ అవ్వడమనేది ఈ సినిమా ప్రేక్షకులు ఏర్పరచుకున్న అభిప్రాయాన్ని తెలియజేస్తోంది. ప్రస్తుతం సెలవులు కావడంతో పర్వాలేదనిపించే విధంగా కలెక్షన్స్ అసలు పరిస్థితి, ఈ సోమ, మంగళవారాల్లో బయట పడుతుంది. మొత్తానికి ‘సంక్రాంతి బుల్లోడు’గా మరోసారి నందమూరి నటసింహం మెరవడం… అది కూడా తెలుగువాడి సత్తాకు నిదర్శనమైన “గౌతమీపుత్ర శాతకర్ణి” పాత్రలో కావడం… ప్రేక్షకుల మదిని దోచింది.



