గవర్నర్ తో స్టాలిన్… శుభవార్త వింటారంటున్న పన్నీర్..!

governor-visit-o-panneerselvam-stalinత‌మిళ‌నాడు అధికార అన్నాడీఎంకే పార్టీలో ఏర్ప‌డిన సంక్షోభం నేపథ్యంలో రాష్ట్రంలో ఆస‌క్తిక‌ర ప‌రిణామాలు చోటుచేసుకుంటున్నాయి. గ‌వ‌ర్న‌ర్ నుంచి ఇంకా ప్ర‌క‌ట‌న రాక‌పోవ‌డంతో అందరిలోనూ సర్వత్రా ఉత్కంఠ నెల‌కొంది. రాష్ట్ర ఇన్ ఛార్జీ గ‌వ‌ర్న‌ర్ విద్యాసాగ‌ర్ రావుతో ప‌న్నీర్ సెల్వం, శ‌శిక‌ళ న‌ట‌రాజ‌న్ వేర్వేరుగా భేటీ కాగా, పన్నీర్ వర్గం సంతోషంలో, శశికళ వర్గం విషాదంలో మునిగిన సంగతులు తెలిసినవే. అయితే తాజాగా తమిళనాడు ప్ర‌తిప‌క్ష డీఎంకే నేత స్టాలిన్ కూడా రాజ్‌ భ‌వ‌న్‌ కు విచ్చేసి గవర్నర్ తో భేటీ అయ్యారు.

పార్టీ సీనియ‌ర్ నేత‌ల‌తో వచ్చి గ‌వ‌ర్న‌ర్‌ ను క‌లిసిన స్టాలిన్… రాష్ట్రంలోని ప‌రిస్థితుల‌పై చ‌ర్చిస్తున్నారు. పన్నీర్ వర్గానికి స్టాలిన్ సహకారం ఉందన్న వార్తల నేపధ్యంలో… గ‌వ‌ర్న‌ర్‌ తో స్టాలిన్ భేటీ అవ‌డం రాజకీయంగా తీవ్ర ప్రాధాన్యతను సంతరించుకునేలా చేసింది. ఈ భేటీ అనంతరం మాట్లాడుతూ… శాసనసభను సమావేశ పరచాలని గవర్నర్ విద్యాసాగర్ రావును కోరినట్లుగా డీఎంకే నేత స్టాలిన్ తెలిపారు. రాష్ట్రంలో తొమ్మిది నెలలుగా పాలన స్తంభించిపోయిందని, సుస్థిర పాలనకు తగు చర్యలు తీసుకోవాలని, రాజ్యాంగానికి లోబడి మంచి నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు.

ADVERTISEMENT

పన్నీర్ సెల్వం వెనుక డీఎంకే ఉందన్న శశికళ వ్యాఖ్యలు సరికాదని ఈ సందర్భంగా స్టాలిన్ మరోమారు స్పష్టం చేసారు. ఇదిలా ఉండగానే, అన్నాడీఎంకే పార్టీ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ శ‌శిక‌ళ న‌ట‌రాజ‌న్‌ పై తిరుగుబాటు చేసిన ప‌న్నీర్ సెల్వం మరోసారి మీడియా ముందుకు వచ్చారు. ప్రజలు మెచ్చిన వ్యక్తే సీఎంగా ఉండాల‌ని, అన్నాడీఎంకేను ఎవ్వ‌రూ చీల్చ‌లేర‌ని, ఎంజీఆర్, జ‌య‌ల‌లిత బాట‌లో న‌డిచి పార్టీని కాపాడుకుందామని పిలుపునిచ్చారు. త‌మ‌కు మంచి రోజులు వ‌స్తాయ‌ని, అతి త్వ‌ర‌లోనే “శుభ‌వార్త” వింటార‌ని అన్నారు. ఓ పెద్ద మ‌ర్రిచెట్టులా ఎదిగిన త‌మ‌ పార్టీని ఎవ్వ‌రూ పెకిలించ‌లేర‌ని స్ప‌ష్టం చేశారు.

పన్నీర్ సెల్వం బలం క్రమంగా పుంజుకుంటున్న నేప‌థ్యంలో ఆయనకు అన్నీ కలిసొస్తున్నట్టు కనబడుతోందని రాజ‌కీయ విశ్లేష‌కులు పేర్కొంటున్నారు. మ‌రోవైపు శశికళకు సుప్రీంకోర్టు నుంచి సమన్లు వచ్చాయని ప్రచారం మొద‌లు కావడంతో, ప‌న్నీర్ సెల్వం వ‌ర్గంలో నూత‌నోత్సాహం క‌నప‌డుతోంది. గ‌వ‌ర్న‌ర్‌ తో భేటీ అనంతరం ప‌న్నీర్ సెల్వం వర్గంలో సంతోషం క‌నప‌డుతోంది. శశికళపై ఉన్న అక్ర‌మాస్తుల కేసుల విష‌యంలో సుప్రీంకోర్టు తీర్పు మరికొంత ఆలస్యం అయ్యే అవకాశముందని వార్త‌లు రావ‌డంతో, త‌మ‌కు మార్గం సుగ‌మ‌మ‌వుతుంద‌ని భావిస్తున్నారు. ఒకవేళ ఈ కేసులో ఆమెను కోర్టు దోషిగా నిర్ణయిస్తే కొంత కాలం పాటు ఎన్నికల్లో పాల్గొనే అవ‌కాశం ఉండ‌దన్న విషయం తెలిసిందే.

ADVERTISEMENT
Latest Stories