వాలంటీర్లా… అంగన్వాడీ కార్యకర్తలు ముఖ్యమా?

Grama Ward Volunteers Anganwadi Workers Strike

వైసీపి ప్రభుత్వానికి వాలంటీర్లు ముఖ్యమా లేక అంగన్వాడీ కార్యకర్తలు ముఖ్యమా అంటే వాలంటీర్లే ముఖ్యమని భావిస్తోంది. త్వరలో జరుగబోయే ఎన్నికలలో ఉపయోగించుకొనేందుకే వాలంటీర్ వ్యవస్థను సృష్టించింది. ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడుతున్నందున జగన్‌ ప్రభుత్వం రాష్ట్రంలోని సుమారు 4.5 లక్షల మంది వాలంటీర్లకు జనవరి 1వ తేదీ నుంచి నెలకు రూ.750 చొప్పున జీతాలు పెంచింది!

వాలంటీర్లు ప్రభుత్వ పధకాలను ప్రజలకు చేర్చడంలో అద్భుతంగా పని చేస్తున్నందున జగన్‌ పుట్టినరోజు కానుకగా వారికి జీతాలు పెంచుతున్నట్లు మంత్రి కారుమూరి నిన్న తిరుమల కొండపై ప్రకటించారు.

ADVERTISEMENT

చట్టబద్దత లేని వాలంటీర్లు అడగకుండానే రూ.750 జీతాలు పెంచిన జగన్‌ ప్రభుత్వం, గత పది రోజులుగా జీతాలు పెంచాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా లక్షల మంది అంగన్వాడీ కార్యకర్తల గోడు పట్టించుకోకపోగా సమ్మె విరమించకపోతే అందరినీ ఉద్యోగాలలో నుంచి పీకేస్తామని బెదిరిస్తోంది.

అంగన్వాడీ వ్యవస్థ చట్టబద్దత ఉంది. వాలంటీర్లతో పోలిస్తే అంగన్వాడీ కార్యకర్తలు పదిరెట్లు ఎక్కువ పనిచేస్తుంటారు. ముఖ్యంగా బాలింతలు, పసిపిల్లలకు వారు చేస్తున్నసేవలు ఎంతో అమూల్యమైనవి. కనుక వారు అడగకమునుపే ప్రభుత్వం వారి జీతాలు పెంచి వారి సమస్యలను పరిష్కారించాల్సి ఉండగా వారి గోడు పాటించుకోవడమే లేదు.

ఏపీ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉష శ్రీచరణ్ అంగన్వాడీ కార్యకర్తల సమ్మెపై స్పందిస్తూ, “జగన్‌ మహిళా పక్షపాతి. అందుకే అంగన్వాడీ కార్యకర్తలకు చాలా మేలు చేశారు. వారి జీతాల పెంపు డిమాండ్‌ని సానుభూతితో పరిశీలిస్తున్నాము. కానీ ఇది సమ్మెకు సమయం కాదు. కనుక తక్షణం సమ్మె విరమించి అందరూ విధుల్లో చేరాలని విజ్ఞప్తి చేస్తున్నాను,” అని అన్నారు.

అంగన్వాడీ కార్యకర్తలు నోరు తెరిచి రోడ్లపై కూర్చొని జీతాలు పెంచమని అడుగుతున్న పెంచబోమని మంత్రి చెప్పడం, వాలంటీర్లు అడగకుండానే జీతాలు పెంచుతున్నట్లు మరో మంత్రి చెప్పడం గమనిస్తే జగన్‌ ప్రభుత్వానికి అంగన్వాడీ కార్యకర్తల కంటే వాలంటీర్లే ముఖ్యమని భావిస్తున్నట్లు స్పష్టమవుతోంది. వానర సైన్యం వంటి వాలంటీర్లు తమను ఎన్నికల వైతారిణి దాటిస్తారని జగన్‌ ప్రభుత్వం భావిస్తోంది. కానీ వారికంటే సమాజంతో ఎక్కువ బలమైన సంబంధాలున్న అంగన్వాడీ కార్యకర్తలు ఈసారి ఎన్నికలలో వైసీపిని ఓడించి బుద్ధి చెపుతామని శపధాలు చేస్తున్నారు.

ADVERTISEMENT
Latest Stories