సొగసు చూడతరమా, బాల రామాయణం, చూడాలనిఉంది, మనోహరం అంటూ మొదలైన గుణశేఖర్ సినీ జీవితం ఒక్కడు సినిమాతో మరో లెవెల్ కి వెళ్లిందనే చెప్పాలి. ఆ చిత్రంలో దర్శకుడిగా గుణశేఖర్ కి అగ్రతాంబూలమే దక్కింది.
అయితే అప్పట్లో గుణశేఖర్ తన సినిమాలతో వరుస నంది అవార్డులు గెలుచుకుని టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన ట్రేడ్ మార్క్ ని సృష్టించుకోగలిగారు, అలాగే తెలుగు చిత్ర పరిశ్రమ అగ్ర దర్శకులలో ఒకరుగా స్థానం ఏర్పరుచుకున్నారు.
ఇక ఆ తరువాత ఆయన తీసిన చిత్రాలలో కథతో సమానంగా సెట్స్ కు ప్రాధాన్యం కల్పించడం, ఒక్కో సందర్భంలో సినిమా కథ కంటే కూడా సినిమా సెట్టింగ్ కే ఎక్కువ ఖర్చు పెట్టడం గుణశేఖర్ సినీ కెరియర్ ని మరో ట్రాక్ లోకి తీసుకెళ్లిందనే చెప్పాలి.
సినిమా విజయాలు సాధించినంత వరకు ఎవరు ఎన్ని ప్రయోగాలు చేసినా, ఎంత పెద్ద విన్యాసాలు ఆడినా ఎవరు పట్టించుకోరు, పెదవి విరవరు. కానీ ఒక్కసారి సక్సెస్ అనే ట్రాక్ తప్పి ఫెయిల్యూర్ అనే ట్రాక్ ఎక్కితే దాని తాలూకా పరిణామాలు ఎలా ఉంటాయి అనేది గుణశేఖర్ అనుభవ పూర్వకంగా తెలుసుకున్నారు.
వరుడు, సైనికుడు, నిప్పు, శకుంతలం అంటూ వరుస డిజాస్టర్ లు చూసిన గుణశేఖర్ దాదాపుగా ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేసినట్టే అన్న అభిప్రాయం వినపడింది. కానీ తాజాగా నిజజీవిత సంఘటనల ఆధారంగా ‘యుఫోరియా’ అంటూ తిరిగి ప్రేక్షకుల ముందుకొచ్చారు గుణశేఖర్.
భూమిక, సారా అర్జున్, గౌతమ్ మీనన్ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన యుఫోరియా చిత్రం ట్రైలర్ నేడు విడుదలైయ్యింది. ఫిబ్రవరి 6 న థియేటర్లలోకి రానున్న ఈ చిత్రం ట్రైలర్ ప్రేక్షుకులను ఆకట్టుకునే విధంగానే ఉంది. ఇన్నాళ్లు భారీ భారీ సెట్టింగ్స్ అంటూ కథను పక్కన పెట్టిన గుణశేఖర్ ఇప్పుడు యదార్ధ జీవితాల ఆధారంగా కథను తెరకెక్కించడంతో గుణశేఖర్ మొత్తానికి రియాలిటీలోకి వచ్చారా అంటున్నారు ఆయన అభిమానులు.






