నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి వైసీపీలో ఉన్నప్పుడు తమ నియోజకవర్గాలలో పనులు జరుగడం లేదని తరచూ అసంతృప్తి వ్యక్తం చేసేవారు. అందుకు వారిని క్రాస్ ఓటింగ్ చేశారనే సాకుతో పార్టీ నుంచి బయటకు సాగనంపారు. అయితే నేటికీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తన నియోజకవర్గంలో పెండింగ్ పనులు పూర్తి చేయాలంటూ దీక్షలు చేస్తూనే ఉన్నారు. పార్టీలో, ప్రభుత్వంలో ఉన్నప్పుడే పనులు చేయించుకోలేనప్పుడు ఇప్పుడు జరుగుతాయనుకోవడం అత్యశే కదా?
అయితే వైసీపీ ఎమ్మెల్యేలలో చాలామంది ఇదే సమస్యను ఎదుర్కొంటున్నారని గుంటూరు కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశంలో గుంటూరు తూర్పు వైసీపీ ఎమ్మెల్యే ముస్తఫా మాటలతో స్పష్టమైంది.
ఇవాళ్ళ శనివారం రెండో రోజు కౌన్సిల్ సమావేశం ప్రారంభం కాగానే ఆయన లేచి నిలబడి, మేయర్కు, పక్కనే ఉన్న అధికారులకు రెండు చేతులు జోడించి దణ్ణం పెడుతూ, “అయ్యా నేను గత 9 ఏళ్ళ బట్టి ఎమ్మెల్యేగా ఉన్నాను. కానీ నా నియోజకవర్గంలో ఒక్క పని కూడా చేయించుకోలేకపోతున్నాను. నియోజకవర్గానికి వెళితే ప్రజలు ‘ఇంకా ఎప్పుడు పనులు మొదలుపెడతారంటూ’ నన్ను నిలదీస్తున్నారు. నేను అధికారులను కలిసి పదేపదే వేడుకొంటున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు.
నా నియోజకవర్గంలో పనులు ఎందుకు, ఎవరు నిలిపివేయిస్తున్నారో చెపితే సంతోషిస్తాను. మళ్ళీ ఎన్నికలొస్తే ప్రజల వద్దకు నేనే వెళ్ళి ఓట్లు అడ్డుకొని గెలవాలి. మీరు కాదు కదా?కనుక తక్షణం నా నియోజకవర్గంలొ పెండింగ్ పనులన్నీ పూర్తి చేయించాలని మిమ్మల్ని చేతులు జోడించి వేడుకొంటున్నాను,” అని అన్నారు.
వైసీపీ ఎమ్మెల్యేలు గడప గడపకి కార్యక్రమంలో పాల్గొనేందుకు ఎందుకు వెనుకంజ వేస్తున్నారో తెలుసుకొనేందుకు ఇదో చిన్న ఉదాహరణ మాత్రమే. కానీ సిఎం జగన్మోహన్ రెడ్డి తాను బటన్ నొక్కి సంక్షేమ పధకాలకు నిధులు విడుదల చేస్తున్నాను కనుక మీరందరూ ప్రజలలోకి వెళ్ళి వాటి గురించి చెప్పుకోవలసిందే లేకుంటే టికెట్స్ ఇవ్వనని హెచ్చరిస్తుంటారు. ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్లుందంటే ఇదేకదా?



