టిఆర్ఎస్ పేరును కేసీఆర్ బిఆర్ఎస్ పార్టీగా ఎందుకు మార్చుకున్నారో అందరికీ తెలుసు. కనుక బిఆర్ఎస్ పార్టీ ఆలోచనలు, మాటలు, వైఖరి అన్నీ జాతీయదృక్పదంతో ఉండాలి. కానీ ఆ పార్టీ నేతల మాటలు నేటికీ ప్రాంతీయ పార్టీ స్థాయిలోనే ఉన్నాయి. తెలంగాణకు మాత్రమే పరిమితమైన ప్రాంతీయ పార్టీ తమది అన్నట్లు వ్యవహరిస్తున్నారు. నిజానికి తమ పార్టీ పేరుని మళ్ళీ టిఆర్ఎస్గా మార్చుకునే ఆలోచనలు కూడా చేస్తున్నారు.
శాసనసభ ఎన్నికలలో ఓటమి తర్వాత ‘తెలంగాణ సెంటిమెంటు’ చాలా బలమైనదని గుర్తించారు. కనుక హరీష్ రావు కృష్ణానదిపై ఉమ్మడి ప్రాజెక్టులను కృష్ణానదీ బోర్డు యాజమాన్యం (కేఆర్ఎంబీ)కి అప్పగించడం వలన తెలంగాణ తీవ్రంగా నష్టపోతుందంటూ ప్రజలను రెచ్చగొట్టి మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ రగిలించేందుకు ప్రయత్నిస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వం, ఏపీలో జగన్ ప్రభుత్వం, కాంగ్రెస్ అధిష్టానం ఒత్తిడితో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రయోజనం కలిగించేందుకు కృష్ణాపై ఉమ్మడి ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించేందుకు సిద్దపడ్డారని హరీష్ రావు వాదిస్తున్నారు.
ఇదే జరిగితే రాష్ట్రంలో రైతులు నష్టపోతారు. అలాగే నాగార్జున సాగర్, శ్రీశైలం హైడల్ ప్రాజెక్టుల నుంచి ఉత్పత్తి అయ్యే 1775 మెగావాట్స్ విద్యుత్ కూడా తెలంగాణ చేజారిపోతుందని హరీష్ రావు వాదించారు. ఇది ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డి విజయమని పత్రికలలో వార్తలు వస్తున్నాయని హరీష్ రావు అన్నారు.
నిజానికి నదీ జలాలపై సాగునీటి ప్రాజెక్టులన్నీ ఆయా బోర్డుల అధీనంలో ఉండాలని కేంద్రం రెండేళ్ళ క్రితమే ఆదేశించింది. కానీ కేసీఆర్ అందుకు ఒప్పుకోలేదు. అది తెలంగాణ మీద ప్రేమ అనుకోవచ్చు లేదా సాగునీటి ప్రాజెక్టుల పేరుతో వేలకోట్లు కమీషన్లు సంపాదించుకోవచ్చని కావచ్చు.
అందుకే నదీ జలాల విషయంలో ఎప్పుడూ ఏపీతో పేచీలు పెట్టుకుంటూనే ఉన్నారు. ఆయనతో జగన్కు మంచి దోస్తీ ఉంది కనుకనే కేసీఆర్ కృష్ణాగోదావరి నదులపై ఎన్ని ప్రాజెక్టులు కట్టుకొంటున్నా పట్టించుకోలేదు. పైగా ఎన్నికల సమయంలో నాగార్జున సాగార్ డ్యామ్ మీద డ్రామా రక్తి కట్టించి కేసీఆర్కు సాయపడాలనే ప్రయత్నించారు.
రాష్ట్ర విభజన జరిగి పదేళ్ళవుతున్నా నదీజల వివాదాలను కేంద్రం పరిష్కరించాలనుకోలేదు. కనుక కృష్ణానదిపై ఉమ్మడి ప్రాజెక్టులు కేఆర్ఎంబీకి అప్పగించాలని ఎవరూ ఒత్తిడి చేయడం లేదనే అర్దమవుతోంది. ఏపీ ప్రభుత్వంపై హరీష్ రావు ఆరోపణలు చేస్తున్నప్పటికీ జగన్ ప్రభుత్వంలో ఎవరూ స్పందించకపోవడం గమనిస్తే ఆ రెండు పార్టీల మద్య ఎంత చక్కటి అవగాహన ఉందో అర్దం చేసుకోవచ్చు.
కనుక హరీష్ రావు ఈ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వంపై బురద జల్లుతూ, తెలంగాణ సెంటిమెంట్ రగిలించేందుకు ప్రయత్నిస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఇదంతా త్వరలో జరుగబోయే లోక్సభ ఎన్నికల కోసమేనని వేరే చెప్పక్కరలేదు.
అయితే కేసీఆర్ జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పాలనుకుంటే, హరీష్ రావు వంటివారు తమది పక్కా ప్రాంతీయ పార్టీ అన్నట్లు, కేసీఆర్ తెలంగాణకు పరిమితమైతే చాలన్నట్లు మాట్లాడుతుండటం విశేషమే కదా?




