రుణమాఫీ: పిల్లికి ఎలుక సాక్ష్యం అంటే ఇదేనా?

Harish Rao

తెలంగాణలో రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం మూడు విడతలలో రూ.2 లక్షల వరకు పంట రుణాలు మొత్తం ఒకేసారి మాఫీ చేసింది. దీంతో లబ్ధి పొందిన తెలంగాణ రైతులు చాలా సంతోషంగా ఉన్నారు. కానీ సాంకేతిక కారణాల వలన నేటికీ అనేక మంది రైతులకు రుణమాఫీ కాలేదు.

ఈవిషయం సిఎం రేవంత్‌ రెడ్డితో సహా మంత్రులు అందరూ అంగీకరిస్తున్నారు. అయితే అర్హుడైన ప్రతీ రైతుకీ పంట రుణాలు మాఫీ చేస్తామని హామీ ఇస్తున్నారు. ఇందుకోసం ప్రతీ జిల్లాలో కలెక్టర్‌ కార్యాలయంలో కౌంటర్లు ఏర్పాటు చేసి డెప్యూటీ కలెక్టర్లకు ఈ బాధ్యత అప్పగించింది. కనుక కాస్త ఆలస్యంగానైనా పంట రుణాలు మాఫీ జరుగుతోంది.

ADVERTISEMENT

ఆర్ధిక సమస్యలు ఎదుర్కొంటున్న రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 8 నెలల్లోనే ఇంత త్వరగా పంట రుణాలు మాఫీ చేయగలదని ఊహించలేకపోవడంతో బిఆర్ఎస్ పార్టీ షాక్‌ అయ్యింది.

ఇప్పటికే బిఆర్ఎస్ పార్టీ పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. ఇప్పుడు ఈ ఒక్క పధకంతో రాష్ట్రంలో రైతులందరూ కాంగ్రెస్‌ పార్టీ వైపు వెళ్ళిపోతే, గ్రామస్థాయిలో కూడా పార్టీ చాలా బలహీనపడుతుంది.

కనుక రాష్ట్రంలో రైతులందరికీ పంట రుణాలు మాఫీ చేయకుండా రేవంత్‌ రెడ్డి మోసం చేశారంటూ హరీష్ రావు దుష్ప్రచారం ప్రారంభించారు.

పిల్లికి ఎలుక సాక్ష్యం అన్నట్లు దీనికి సంబందించి సాక్షి పత్రికలో వచ్చిన వార్తలను మీడియాకు చూపిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసిందనడానికి ఇదే నిదర్శనం అని వితండవాదం చేస్తున్నారు.

అయితే అదేదో తమ సొంత పత్రికలో వేసుకున్న వార్తలనే చూపించవచ్చు కదా? సాక్షియే ఎందుకు?అంటే అది వేరే పత్రిక కనుక దానిలో ప్రచురించిన వార్తలను ప్రజలు నమ్ముతారనే ఆలోచన కావచ్చు.

ప్రస్తుతం బిఆర్ఎస్, వైసీపి రెండు పార్టీల పరిస్థితి ఒకేలా ఉంది. కనుక ఏపీలో అన్యాయాలు, అక్రమాలు, అరాచకాలు జరిగిపోతున్నాయని, వాటిపై జగన్‌ అలుపెరుగని పోరాటాలు చేస్తున్నారంటూ బిఆర్ఎస్ సొంత పత్రికలోను, అందుకు ప్రతిగా తెలంగాణలో అన్యాయాలు, అక్రమాలు, అరాచకాలు జరిగిపోతున్నాయని వాటిపై కేటీఆర్‌, హరీష్ రావులు అలుపెరుగని పోరాటాలు చేస్తున్నారంటూ వైసీపి సొంత పత్రికలో వేసుకోవాలనే ఒప్పందం ఏమైనా జరిగిందేమో? బహుశః అందుకే హరీష్ రావు సాక్షి పేపర్‌ని సాక్ష్యంగా చూపుతున్నారేమో? పిల్లికి ఎలుక సాక్ష్యం అంటే ఇదేనా?

ADVERTISEMENT
Latest Stories