వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణపై కేంద్ర ప్రభుత్వం ‘యూటర్న్’ తీసుకోవడంతో తెలంగాణ మంత్రులు అప్పుడే ఇది తమ వియజమని గొప్పలు చెప్పుకోవడం మొదలుపెట్టారు. ఏపీలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టిడిపిలు చేయలేని పని మేము చేసి చూపించామని తెలంగాణ మంత్రి హరీష్ రావు చెప్పుకొన్నారు.
కేసీఆర్ దెబ్బకు మోడీ ప్రభుత్వం దిగి వచ్చి, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణపై వెనక్కు తగ్గిందని, ప్లాంట్ని నడిపిస్తామని చెప్పిందని మంత్రి హరీష్ రావు అన్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ని దానిలో 40 వేల మంది కార్మికులను కాపాడుకొనేందుకు ఏపీలో పార్టీలు ప్రయత్నించకపోయినా కేసీఆర్ ప్రయత్నించారని మంత్రి హరీష్ రావు అన్నారు. ఇక ముందు కూడా ఏపీ ప్రజల కోసం పోరాడేందుకు తమ అధినేత కేసీఆర్, తాము సిద్దంగా ఉన్నామని మంత్రి హరీష్ రావు అన్నారు.
ఈరోజు విశాఖపట్నం వచ్చిన కేంద్ర ఉక్కు శాఖ సహాయమంత్రి ఫగన్ సింగ్ కులస్తే, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణపై ముందుకు సాగడం లేదని, ప్లాంట్ని నడిపించేందుకు కార్మిక సంఘాలతో చర్చలు జరుపుతామని చెప్పారు.
ఈ విషయంలో కేసీఆర్ తలదూర్చేవరకు ఏపీ ప్రభుత్వం, మంత్రులు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణను అసలు సమస్యగానే గుర్తించలేదని చెప్పవచ్చు. చంద్రబాబు నాయుడుని, అమరావతి రైతులను తిట్టేందుకు ఆసక్తి చూపే మంత్రులు వైసీపీ ఎమ్మెల్యేలు, వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మికుల పోరాటాల గురించి కనీసం మాట్లాడలేదు.
కనీసం కేసీఆర్ జోక్యం చేసుకొన్న తర్వాత అయినా వారి స్పందన సరిగాలేదు. తెలంగాణ మంత్రుల మీద ఎదురుదాడి చేసి వాళ్ళ నోళ్ళు మూయించాలనుకొన్నారే కానీ వైజాగ్ స్టీల్ ప్లాంట్ని కాపాడుకొనేందుకు మేము పోరాడుతామని చెప్పలేకపోయారు.
కేంద్రం ఏ కారణంతో దీనిపై యూటర్న్ తీసుకొన్నప్పటికీ, ఇప్పుడు ఆ క్రెడిట్ తెలంగాణ మంత్రులకు, వారి బిఆర్ఎస్ పార్టీకే లభిస్తుంది తప్ప వైసీపీకి కాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, దాని ప్రయోజనాలు, ప్రజలపై బిఆర్ఎస్ పార్టీకి ఎటువంటి ఆపేక్ష లేనప్పటికీ, ఈ క్రెడిట్ సంపాదించుకొంది. కానీ ఎదురుగా ఇంత గొప్ప అవకాశం ఉన్నప్పటికీ వైసీపీ చేజార్చుకోవడమే కాక ఏపీ ప్రయోజనాల కంటే రాజకీయాలకే తాము ఎక్కువ ప్రాధాన్యం ఇస్తామని స్వయంగా చాటింపు వేసుకొన్నట్లు వ్యవహరించిది ఈ విషయంలో.



