వృద్ధ కపోతాలు మళ్ళీ కాంగ్రెస్ గూటికి చేరుతున్నట్టు ఉన్నాయి. పోలవరం ప్రాజెక్టును ఈ సంవత్సరం పూర్తి చేయాలని కోరుతూ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి మహాపాదయాత్ర చేపడుతున్నారు. పాదయాత్ర కాసేపటిక్రితం ధవళేశ్వరం నుంచి ప్రారంభమై సాయంత్రానికి పశ్చిమగోదావరిజిల్లా కొవ్వూరుకు చేరుకుంటుంది.
10న పోలవరం చేరుకుని అక్కడ సామూహిక సత్యాగ్రహం చేపట్టబోతున్నారు. మరోవైపు పాదయాత్రలో భాగంగా నిర్వహించిన సభలో ఒకప్పటి కాంగ్రెస్ సీనియర్ నేతలు, మాజీ ఎంపీలు ఉండవల్లి అరుణ్ కుమార్, హర్షకుమార్ పాల్గొన్నారు. రాష్ట్ర విభజన టైములో కాంగ్రెస్ నుండి సస్పెండైన వీరు అప్పటినుండి ఏ పార్టీలోనూ లేరు.
ఇప్పుడు మళ్ళీ వీళ్ళు కాంగ్రెస్ కార్యక్రమంలో పాల్గొనడంతో కాంగ్రెస్ లో తిరిగి జాయిన్ కాబోతున్నారా అనే ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే ఇప్పటికే అవసాన దశలో ఉన్న కాంగ్రెస్ కు వీరు ఏమాత్రం జీవం పొయ్యగలరో అనేది అనుమానమే. అయితే చాలా కాలం తరువాత వీళ్ళు మళ్ళీ పార్టీ కార్యక్రమంలో పాల్గొనడంతో పార్టీ శ్రేణులు ఉత్సాహంగా ఉన్నాయి.



