ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబ సంస్థ హెరిటేజ్ ఫుడ్స్ లో డైరెక్టర్ హోదాలో ఉన్న మోటపర్తి శివరామ వరప్రసాద్ విదేశాల్లో నల్లధనాన్ని దాచుకున్నారని ‘పనామా’ పేపర్స్ లో వెల్లడైంది. బ్రిటీష్ వర్జిన్ ఐలాండ్స్ తో పాటు పనామా, ఈక్వెడార్ లలోని మూడు కంపెనీల ద్వారా దేశంలోని డబ్బును అక్రమంగా తరలించి, ఇండియాలో చెల్లించాల్సిన పన్నులు ఎగ్గొట్టారని ఓ ప్రముఖ ఆంగ్ల దినపత్రిక పూర్తి వివరాలతో కూడిన కథనాన్ని ప్రచురించి సంచలనం కలిగించింది.
ఎంపీ హోల్డింగ్స్ అసోసియేట్స్, బాలీవార్డ్ లిమిటెడ్, బిట్ కెమీ వెంచర్స్ లిమిటెడ్ అనే పేర్లతో ఉన్న కంపెనీలకు సంబంధించిన దస్త్రాల్లో ‘హెరిటేజ్’ డైరెక్టర్ మోటపర్తి పేరు ఉన్నట్టు తెలిపింది. ఈ లావాదేవీలపై పూర్తి విచారణ జరిపితే, ఆయన ఎవరి బినామీనో తెలిసిపోతుందని చంద్రబాబు పేరును ప్రస్తావించకుండా పరోక్ష అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఈ కథనాన్ని చూసిన తెలుగుదేశం పార్టీ నేతలు సదరు కధనంపై మండిపడుతున్నారు. రెండేళ్ల క్రితం హెరిటేజ్ ఫుడ్స్ డైరెక్టర్ గా విధులు స్వీకరించిన వరప్రసాద్ కుమారుడు సునీల్ బిట్ కెమీ వెంచర్స్ అనే సంస్థలో పెట్టుబడులు పెట్టినట్టు పనామా పేపర్స్ తెలిపింది.



