టాలీవుడ్ యువ హీరో తనీష్ తండ్రి వర్ధన్ మంగళవారం నాడు రాత్రి పొద్దుపోయిన తర్వాత దుర్మరణం పాలయ్యారు. మణికొండలోని వెస్ట్రన్ ప్లాజా అపార్ట్ మెంటులో తనీష్ కుటుంబం నివాసముంటోంది. అయితే మంగళవారం నాడు రాత్రి తమ ఫ్లాట్ లోని రెయిలింగ్ వద్దకు వచ్చిన వర్ధన్, అక్కడి నుంచి ప్రమాదవశాత్తు కింద పడిపోయారు.
ఆరో అంతస్తు నుంచి కింద పడిన కారణంగా వర్ధన్ కు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆయనను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో వైద్యులు చికిత్స అందిస్తున్న క్రమంలోనే వర్ధన్ మరణించారు. దీంతో తనీష్ తో పాటు కుటుంబ సభ్యులు శోకసంధ్రంలో మునిగారు. అయితే ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు వెలుగు చూడాల్సి ఉంది.
‘మన్మధుడు’ సినిమాలో సోనాలి బింద్రే తమ్ముడిగా పేరు తెచ్చుకున్న తనీష్, ‘నచ్చావులే’ సినిమాతో హీరో అయిన విషయం తెలిసిందే. తొలినాళ్ళల్లో పలు విజయవంతమైన సినిమాలలో నటించిన తనీష్, ఇటీవల కాలంలో చాలా నేమ్మదించాడు. అయితే యువహీరోల ఆడియో వేడుకలలో మాత్రం తనీష్ దర్శనమిస్తూ ఉంటాడు.



