రెండు తెలుగు రాష్ట్రాలలో సినిమా టికెట్ల ధరలను పెంచుకోవడానికి థియేటర్లకు అనుమతినిస్తూ హైదరాబాద్ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అయితే అన్ని తరగతుల ప్రతిపాదిత టికెట్ల ధరల సమాచారం సంబంధిత యంత్రాంగానికి ఇవ్వాలని కండిషన్ పెట్టింది. ప్రభుత్వం కమిటీలు ఏర్పాటు చేసి ధరలకు సంబందించిన మార్గదర్శకాలు రూపొందించేదాకా థియేటర్ల యజమానులు ధరలను పెంచుకోవచ్చని స్పష్టం చేసింది.
హైకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలు అమలవుతున్నాయో లేదో జాయింట్ కలెక్టర్లు పర్యవేక్షించాలని, దీనిపై నివేదికను సమర్పించాలని ఆదేశించింది. ఈ వ్యవహారంపై కౌంటర్లు దాఖలు చేయాలంటూ తదుపరి విచారణను ఫిబ్రవరి 1వ తేదీకి వాయిదా వేసింది. ఈ నిర్ణయం వల్ల సంక్రాంతికి విడుదల కాబోతున్న అజ్ఞాతవాసి, జై సింహ చిత్రాలు లాభపడనున్నాయి.
తమ సినిమా హాళ్లలో టిక్కెట్ ధరల పెంపు నిమిత్తం పెట్టుకున్న దరఖాస్తుల విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంలేదని, జీవో జారీ చేసేలోగా ధరలను పెంచుకోవడానికి అనుమతించాలంటూ పలు థియేటర్లు హైకోర్టును ఆశ్రయించాయి. 2013 నుండి ఆ ప్రతిపాదన ఉన్న గవర్నమెంట్ ధరలు పెంచే ప్రయత్నం చెయ్యలేదు. తెలంగాణ ప్రభుత్వం జీవో 75 జారీ చేసినప్పటికీ దాని అమలును నిలిపివేసింది.



