ఒక సినిమా తాలూకు వివాదమైనా ఫలితమైనా ముందుగా టార్గెట్ అయ్యేది దర్శకుడు, ఆ తర్వాత హీరో. గత శుక్రవారం విడుదలైన ప్యాన్ ఇండియా మూవీ ఆదిపురుష్ మొదటి వీకెండ్ వసూళ్లు దుమ్ము దులిపేశాయి. తర్వాత నెమ్మదించడం వేరే విషయం. కానీ దీని చుట్టూ నెలకొన్న కాంట్రావర్సీ అసలు కంటెంట్ కంటే ఎక్కువ చర్చలోకి వచ్చింది. చాలా చోట్ల పోస్టర్లు తగలబెట్టారు.
హిందుత్వ ప్రభావం ఎక్కువగా ఉండే ఉత్తరాది రాష్ట్రాల్లోని థియేటర్లలో హఠాత్తుగా స్క్రీనింగులు ఆపేసిన ఉదంతాలు వీడియో రూపంలో వచ్చాయి. కొందరు ఏకంగా ఆదిపురుష్ ని నిషేధించాలంటూ ప్రధానికి లేఖ రాయడం మరో సంచలనం. ఓటిటిలో సైతం రిలీజ్ కానివ్వద్దంటూ నిరసనలు చేస్తూనే ఉన్నారు.
కానీ ఎక్కడ కూడా ప్రభాస్ ని లక్ష్యంగా పెట్టుకోవడమో లేదా తనవైపు తప్పుందని నిందించేలా ప్రవర్తించడమో ఎవరూ చేయలేదు. మాములు పరిస్థితుల్లో ఈ స్థాయి వివాదం చెలరేగినప్పుడు హీరోని కూడా బాధ్యుణ్ణి చేసి వివరణో క్షమాపణ కోరడమో డిమాండ్ చేసేవాళ్ళు. కానీ అదృష్టవశాత్తు అలాంటిదేమి జరగలేదు. అదే పనిగా టార్గెట్ చేయడం లేదు.
అందరి వేళ్ళు దర్శకుడు ఓం రౌత్, రచయిత మనోజ్ వైపే వెళ్తున్నాయి. రామాయణాన్ని తమ చిత్తానికి మార్చడమే కాక ఇంటర్వ్యూలలో మాటలు ఏమార్చేసి చెప్పడం ఇష్యూని ఇంకా పెద్దది చేసింది. రావణుడి ఎపిసోడ్ తో పాటు వివిధ అంశాల పట్ల పబ్లిక్ అభ్యంతరం వ్యక్తం చేస్తూనే వచ్చింది.
ఈ పరిణామాలు ఓం రౌత్ భవిష్యత్ అవకాశాల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తాయో వేచి చూడాలి. ప్రభాస్ వరకు ఫిల్మోగ్రఫీలో మరో కౌంట్ తోడవ్వడం తప్ప స్టార్ డంకు వచ్చిన ఇబ్బందేమీ లేదన్నది స్పష్టం. దీన్ని బట్టే ప్రభాస్ కున్న ఇమేజ్ హిట్టు ఫ్లాపుకు అతీతంగా నార్త్ లోనూ ఎంత బలంగా నాటుకుపోయిందో అర్థం చేసుకోవచ్చు.
ఆదిపురుష్ వల్ల సలార్ కు వచ్చిన డ్యామేజేమీ ఉండదు. పైపెచ్చు ఇంతకన్నా ఎక్కువ రేట్లకు అమ్ముడుపోయినా ఆశ్చర్యం లేదు. ఓం రౌత్ వల్ల జరిగిన నష్టానికి ప్రభాస్ ని బాధ్యుణ్ణి చేయలేదు కాబట్టి డార్లింగ్ బ్రాండ్ తో పాటు ప్రశాంత్ నీల్ స్టాంప్ కీలక పాత్ర పోషించనుంది. సోషల్ మీడియా ట్రెండ్స్ చూసినా బాలీవుడ్ విశ్లేషకులు, ప్రేక్షకులు ఎక్కడా ప్రభాస్ ని నిందించిన దాఖలాలు లేవు.



