రెండు రాష్ట్ర రాజకీయాలలో రాజకీయ సమీకరణాలు మునుపెన్నడూ లేని విధంగా మారుతున్నాయి, ఒక రకంగా చెప్పాలంటే నాయకులు మారుస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే గత కొన్ని దశాబ్దాలుగా ఏపీ రాజకీయాలు రెండు సామాజికవర్గాల రాజకీయ విభేదాలతో రెండు భిన్న దృవాలుగా ఉండేవి.
రంగా హత్యానంతరం ఏపీలో కమ్మ vs కాపు అన్నట్టుగా రాజకీయాలు ముందుకెళ్లాయి. అయితే ఈ రెండు వర్గాల మధ్య మొదలైన విభేదాలకు ఎప్పటికప్పుడు తమ రాజకీయాలతో ఆజ్యం పోస్తూ కొంతమంది రాజకీయ నాయకులు పరిస్థితులను తమ పార్టీకి అనుకూలంగా మలుచుకోవడంలో పూర్తిగా విజయం సాధించారనే చెప్పాలి.
అయితే 2024 ఎన్నికలకు ముందు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను అంటూ ప్రకటించిన జనసేనాని పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ సిద్ధాంతాలలో ఒకటైన కులాలను కలిపే రాజకీయాన్ని తెరమీదకు తెచ్చారు. బాబు అరెస్టుతో బేషరతుగా టీడీపీ కి మద్దతు పలికిన పవన్ బాబు కి అండగా నిలిచేందుకు సిద్ధం అంటూ వైసీపీ తో రాజకీయ యుద్దానికి సై అన్నారు.
టీడీపీ – జనసేన రాజకీయ పొత్తు రెండు సామాజికవర్గాలు ఒక్కటి చేసింది, అలాగే వైసీపీ వై నాట్ 175 నినాదాన్ని పగటి కలగా మార్చింది. ఈ రెండు సామాజికవర్గాలు ఒక్కటిగా ఉంటే ఇక వైసీపీ కి రాజకీయ భవిష్యత్ ఉండదని గ్రహించిన వైసీపీ ఇప్పటికి కాపు – కమ్మ అంటూ కుల రాజకీయాలు చేస్తూ ఇరు సామాజికవర్గాల మధ్య రాజకీయ వైరాన్ని సృష్టించేందుకు అలుపెరుగని ప్రయత్నాలు సాగిస్తూనే ఉంది.
అయితే టీడీపీ – జనసేన పొత్తుతో పవన్ ఏపీలో కమ్మ – కాపు అనే రెండు సామాజికవర్గాలను ఒక్క దాటి మీదకు తెచ్చి ఏపీ రాజకీయ సమీకరణలు మార్చినట్టే, తెలంగాణలో రేవంత్ రెడ్డి టీడీపీ – కాంగ్రెస్ అనే రెండు భిన్న ధ్రువాలను ఒక్కటి చేసారు. టీడీపీ నాయకుడిగా బాబు కి నమ్మిన నేతగా తెలుగు తమ్ముళ్ల మనసు గెలుచుకున్న రేవంత్ రెడ్డి పార్టీ మారినప్పటికీ టీడీపీ రాజకీయ మద్దతును కాంగ్రెస్ కు బదిలీ చేయించుకోగలిగారు.
కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం గా ఏర్పడిన టీడీపీ ని టీడీపీ క్యాడర్ ని కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి రేవంత్ వినియోగించుకుంటున్నారు. అందుకు ప్రతిగా టీడీపీ క్యాడర్ కు తగిన ప్రాధాన్యం ఇస్తున్నారు, అవకాశం ఉన్న చోట టీడీపీ నేతల పై తనకున్న గౌరవాన్ని ప్రదర్శిస్తున్నారు.
ఇందుకు నిన్న అమీర్ పేట మైత్రి వనంలో ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటు ఒక మంచి ఉదాహరణగా నిలుస్తుంది. అలాగే బాబు తో తనకున్న అనుబంధాన్ని సైతం రేవంత్ అనేక రాజకీయ, మీడియా వేదిక ల మీద ఎప్పటికప్పుడు ప్రకటిస్తూనే వస్తున్నారు. దీనితో తెలంగాణలో అనధికారికంగా రేవంత్ టీడీపీ మద్దతుదారులను కాంగ్రెస్ క్యాడర్ గా మార్చుకుంటూ తెలంగాణలో కొత్త రాజకీయ సమీకరణలకు భీజం వేశారు.
ఇలా ఈ ఇద్దరు నేతలు పవన్, రేవంత్ టీడీపీ తో కలిసి ఏపీలో రెండు భిన్న సామాజికవర్గాలను రాజకీయంగా ఒక్కటి చేసారు, ఇక తెలంగాణలో రెండు భిన్న రాజకీయ సిద్ధాంతాలు ఉన్న పార్టీల క్యాడర్ ని ఒకేతాటి మీదకు తెచ్చారు.



