ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మొదలు మంత్రులు, వైసీపి ఎమ్మెల్యేలు అందరూ కూడా చంద్రబాబు నాయుడు ఒక అవినీతిపరుడు అని ముద్ర వేసేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్నారు. దానిలో భాగంగానే స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ చేయడం కూడా.
అయితే చంద్రబాబు నాయుడు కృషి ఫలితంగానే ఐటి రంగంలో లక్షలాది మందికి ఉద్యోగాలు వచ్చాయి. వాటితో వారు జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదగగలిగారు. అందుకే హైదరాబాద్లోని ఐటి కంపెనీల ఉద్యోగులు చంద్రబాబు నాయుడుకి సంఘీభావం తెలుపుతూ, ఆయన అరెస్టుని ఖండిస్తూ విప్రో జంక్షన్ వద్ద ఈరోజు మెరుపు ధర్నా చేశారు. ‘మేము చంద్రబాబు నాయుడుతోనే’ అని వ్రాసున్న ప్లకార్డులు పట్టుకొని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
చంద్రబాబు నాయుడుకి వివిద పార్టీల రాజకీయనేతలు సంఘీభావం ప్రకటించడం పెద్ద విశేషం కాదు కానీ చంద్రబాబు నాయుడు కృషి వలన ఐటి రంగంలో స్థిరపడిన ఉద్యోగులు రోడ్లపైకి వచ్చి ఆయనకు మద్దతుగా ధర్నా చేయడం ఖచ్చితంగా చెప్పుకోవలసిన విషయమే.
రాష్ట్రాభివృద్ధి కోసం ప్రజల సంక్షేమం కోసం ఎంతగానో కృషి చేసిన చంద్రబాబు నాయుడుపై తప్పుడు ఆరోపణలు మోపి జగన్ ప్రభుత్వం జైల్లో వేసి ఆయన ప్రతిష్టను దెబ్బతీయాలని ప్రయత్నిస్తుంటే, చంద్రబాబు నాయుడు కారణంగానే తమ జీవితాలలో వెలుగులు నిండాయని ఐటి ఉద్యోగులు హైదరాబాద్లో కృతజ్ఞతాపూర్వకంగా సంఘీభావం తెలుపడం ఆయనకి లభించిన అత్యుత్తమ పురస్కారంగా భావించవచ్చు.
ఈ నాలుగేళ్ళ పాలనలో సంక్షేమ పధకాలు, అప్పులే తప్ప వైసీపి చేసిందేమీ లేదు కనుకనే బటన్ నొక్కుడు సభలకు లబ్ధిదారులను బలవంతంగా తరలించవలసివస్తోంది. కానీ ఏపీలో చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేశారని తెలియగానే హైదరాబాద్లో ఐటి కంపెనీ ఉద్యోగులు రోడ్లపైకి వచ్చి సంఘీభావం ప్రకటిస్తున్నారు. ఇదే చంద్రబాబు నాయుడుకి.. జగన్మోహన్ రెడ్డికి ఉన్న పెద్ద తేడా!



