అనేక ఐటి కంపెనీలు, చిన్న పెద్ద పరిశ్రమలు, ఎక్కడికక్కడ ఫ్లై ఓవర్లు, నగరం ఆ కొస నుంచి ఈ కొస వరకు పరుగులు తీస్తున్న మెట్రో, బహుళ అంతస్తుల భవనాలు… ఇలా ఒకటా రెండా… హైదరాబాద్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.
ఇంతగా అభివృద్ధి చెందిన హైదరాబాద్ పరిస్థితి భారీ వర్షాలు, వరదలతో ఇప్పుడు చాలా దయనీయంగా మారింది. ఈ వర్షాలు, వరద కష్టాల గురించి కూడా ఎంత చెప్పుకున్నా తరిగేవి కావు. కానీ ఏటా ఈ సమస్య ఎదురవుతుందని తెలిసి ఉన్నా పాలకులు ఏమీ చేయలేకపోతున్నారు.
హైదరాబాద్ ప్లాన్డ్ సిటీ కాదు కనుక ఇటువంటి సమస్యలు అనివార్యమే. కానీ ఇవి చాలా తీవ్రంగా మారుతున్నప్పుడు తప్పనిసరిగా శాశ్విత పరిష్కారాలు వెతకాలి కదా? కానీ ట్రంప్ సుంకాలకు జీఎస్టీ మందు వేసినట్లు, వరద నీటిని తోడి పోసేందుకు పంపులు ఏర్పాటు చేసింది జీహెచ్ఎంసీ.
అందుకు దానిని తప్పు పట్టలేము. కాలువలు, చెరువులపై అక్రమ కట్టడాలను హైడ్రా తొలగిస్తే ఎదురయ్యే విమర్శలు, రాజకీయాలను భరించడమే కష్టంగా ఉంది. కనుక జీహెచ్ఎంసీ మంత్ర దండం తిప్పి ఈ సమస్యలన్నిటినీ మాయం చేయలేదు.
ఇక కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓ పక్క ఆర్ధిక, రాజకీయ సమస్యలు, మరోపక్క సూపర్ సిక్స్ హామీలతో కాళ్ళు చేతులు కట్టేసినట్లయింది. కనుక ఇటువంటి సందర్భంలో పరిస్థితిని నిశితంగా గమనించడం లేదా సచివాలయం నుంచి సహాయ చర్యలు పర్యవేక్షించడంతోనే సరిపెట్టుకోక తప్పడం లేదు.
సముద్రానికి, నదులకు ఎంతో దూరంగా ఉన్న హైదరాబాద్ పరిస్థితే ఈవిదంగా ఉంటే, వాటి పక్కనే ఉన్న అమరావతి పరిస్థితి ఎలా ఉంటుంది?అనే సందేహం తప్పక కలుగుతుంది.
కనుక అమరావతికి ఎన్నటికీ హైదరాబాద్ దుస్థితి కలగకుండా ఏపీ ప్రభుత్వం ముందస్తు ఏర్పాట్లన్నీ చేస్తుందనే ఆశిద్దాం. లేకుంటే తాము వద్దని ఎంత మొత్తుకుంటున్నా చంద్రబాబు నాయుడు వినకుండా లక్షల కోట్లు ఖర్చు చేసి అమరావతి నిర్మించారని విమర్శించేందుకు జగన్మోహన్ రెడ్డి, వైసీపీ నేతలు సిద్దంగానే ఉన్నారనే విషయం మరిచిపోరాదు.




