అక్కినేని అఖిల్ ను హీరోగా పరిచయం చేస్తూ హీరో నితిన్ నిర్మించిన “అఖిల్” అనుభూతులు ఇంకా వెన్నాడుతూనే ఉన్నాయి. ఈ సినిమా హక్కుల విషయంలో 50 లక్షల రూపాయలు తన వద్ద తీసుకుని, హక్కులు ఇవ్వకుండా మోసం చేసారంటూ సికింద్రాబాద్, సైనిక్ పురికి చెందిన గంగాధర సత్యనారాయణ సైబరాబాద్ రెండో అదనపు జూనియర్ సివిల్ జడ్జి కం 20ఫ మెట్రోపాలిటన్ కోర్టులో ఫిర్యాదు చేసారు. గతేడాది సెప్టెంబర్ 23న దాఖలు చేసిన ఈ పిటిషన్ లో శ్రేష్ట్ మూవీస్ ను మొదటి నిందితునిగా, సుధాకర్ రెడ్డి ఏ2గా, నితిన్, నిఖితలను ఏ3, ఏ4లుగా పేర్కొన్నారు.
అయితే దీనికి కౌంటర్ గా శ్రేష్ట్ మూవీస్, సుధాకర్ రెడ్డి, నితిన్, నిఖితారెడ్డిలు వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేయగా, దీనిని విచారించిన కోర్టు, ఈ కేసు నుండి నితిన్, నిఖితారెడ్డిలకు విముక్తి ఇస్తూ తీర్పునిచ్చింది. శ్రేష్ట్ మూవీస్ సంస్థలో నితిన్, నిఖితారెడ్డిలు అసలు భాగస్వామ్యులు కారని, సదరు సంస్థకు వారికి ఎలాంటి అనుబంధం లేదని పిటిషనర్ల తరపున న్యాయవాది వాదిస్తూ కోర్టు దృష్టికి తీసుకురాగా, సదరు వాదనలను ఆమోదించిన కోర్టు ఈ కేసులో నితిన్, నిఖితారెడ్డిల ప్రమేయం లేదని కొట్టివేసింది. దీంతో హీరోగా నితిన్ కు ఊరట లభించినట్లయ్యింది.



