జగన్‌ సభకు రాకపోతే ఏపీకి మహోపకారమే కదా?

YS Jagan AP Assembly

‘ఇక శాసనసభలో మనకి పని లేదంటూ’ వైసీపి అధినేత జగన్మోహన్‌ రెడ్డి వెళ్ళిపోవడం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి మహోపకారంగానే భావించవచ్చు.

ఆయన తన 10 మంది ఎమ్మెల్యేలను వెంటబెట్టుకొని శాసనసభ సమావేశాలకు హాజరవుతుంటే, ఆయన సమావేశాలను సజావుగా జరగనీయకుండా ఏవో విమర్శలు, ఆరోపణలు చేస్తూ అడ్డుపడుతుంటారు. అప్పుడు కూటమి ఎమ్మెల్యేలు కూడా ఆయనతో వాగ్వాదాలకు చేయక తప్పదు.

ADVERTISEMENT

రాజకీయ కోణంలో జరిగే ఈ వాగ్వాదాల వలన మానవమానాలే తప్ప వాటితో రాష్ట్రానికి ఎటువంటి ప్రయోజనం ఉండదు. జగన్‌ సభలో ఉంటే విలువైన సభా సమయం వృధా అవుతుంటుంది కనుక ఆయన తొలిసారిగా తన వలన రాష్ట్రానికి నష్టం కలుగకుండా స్వయంగా శాసనసభ నుంచి వెలివేసుకొని బయటకు వచ్చేశారు. జగన్‌ తాను మాట తప్పనని… మడమ తిప్పనని చెప్పుకుంటారు కనుక ఆయన తన ఈ నిర్ణయానికి 5 ఏళ్ళు కట్టుబడి ఉంటే అది చాలా సంతోషించవలసిన విషయమే.

ఇప్పుడు శాసనసభలో ఉన్న సభ్యులందరూ అధికార పార్టీల వారే… ప్రభుత్వంలో భాగస్వాములే. అందరి మద్య మంచి సఖ్యత కూడా ఉంది. ముఖ్యంగా ఇకపై శాసనసభలో వైసీపి గురించి మాట్లాడుతూ సమయం వృధా చేసుకోనవసరం లేదు. కనుక అజెండా ప్రకారం సభలో రాష్ట్రానికి, ప్రజలకు సంబందించిన అన్ని అంశాలపై లోతుగా చర్చించి నిర్ణయాలు తీసుకోవచ్చు.

ఈసారి శాసనసభలో చాలా అనుభవం ఉన్న సీనియర్స్, సరికొత్త ఆలోచనలు చేయగల జూనియర్స్ కూడా ఉన్నారు. శాసనసభలో ఇప్పుడు ఒకటి కాదు… మూడు పార్టీలకు చెందిన సభ్యులు ఉన్నారు.

కనుక అమరావతి, పోలవరం నిర్మాణ పనులు వంటి భారీ ప్రాజెక్టులతోపాటు, పరిశ్రమలు, ఉద్యోగాలు కల్పన, మౌలిక వసతుల అభివృద్ధి, విద్యా, వైద్యం, విద్యుత్, వ్యవసాయం వంటి రంగాల అభివృద్ధి వంటి ప్రతీ అంశంపై వివిద కోణాలలో చర్చించుకొని అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయాలు తీసుకోవచ్చు.

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ ఉన్న క్లిష్ట పరిస్థితులలో శాసనసభలో ఇటువంటి సానుకూల వాతావరణం ఏర్పడటం చాలా శుభసూచకంగానే భావించవచ్చు. జగన్మోహన్‌ రెడ్డి తన నిర్ణయానికి కట్టుబడి ఉండే మాటయితే ఈ క్రెడిట్ ఆయనకే ఇవ్వాలి.

ఎన్నికలలో ఓడి మొట్టమొదటిసారి ఏపీకి ‘మేలు’ చేసిన జగన్, ఇప్పుడు ఈవిదంగా కూడా ‘మేలు’ చేసిపోవడం చాలా సంతోషకరమే. కనుక జగన్‌ సభకు రానందుకు తప్పు పట్టడం సరికాదు. అందుకు ఆయనకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకోవలసిందే. ఏది ఏమైనప్పటికీ ఏపీకి మళ్ళీ మంచి రోజులు వచ్చిన్నట్లే ఉన్నాయి.

ADVERTISEMENT
Latest Stories