తమిళంలో దారుణ పరాజయాన్ని చవిచూసిన “24” సినిమా తెలుగులో మాత్రం అద్భుత విజయాన్ని సాధించింది. ‘ఆత్రేయ’ పాత్రలో సూర్య నటనకు ప్రేక్షకులు ‘జై’ కొడుతున్నారు. అయితే ఈ సినిమాలో నటించాల్సిందిగా తొలుత ప్రిన్స్ మహేష్ బాబు వద్దకు వెళ్ళినట్లుగా ఇటీవల ఇచ్చిన ప్రమోషన్ ఇంటర్వ్యూలో దర్శకుడు విక్రమ్ కే కుమార్ తెలిపారు.
కధ విన్న తర్వాత… ఈ కధ కోసం నన్ను ఎలా సంప్రదించారు అన్న మహేష్… తమిళ హీరో సూర్య అయితే బాగుంటుందని సలహా ఇచ్చారని, అక్కడ నుండి “24” సినిమా ప్రయాణం మొదలైనట్లుగా తెలిపారు. ఇటీవల సినిమా చూసిన మహేష్ అభినందించారని కూడా తెలిపిన విక్రమ్, తన తదుపరి సినిమాను బన్నీతో ‘స్టెమ్ సెల్స్’తో ముడిపడి ఉంటుందని, ఇండియాలోనే ఇప్పటివరకు రానటువంటి కధతో తెరకెక్కిస్తున్నట్లు స్పష్టం చేసారు.
అయితే… ఒక్కసారి టైం వాచ్ తో వెనక్కి వెళ్లి… ‘24’ సినిమా కధ చెప్పగానే మహేష్ ఒప్పుకుని, తాజాగా విడుదలైనట్లయితే ఫలితం ఎలా ఉండేది అన్న విషయాన్ని ఆలోచిస్తే… టైం వాచ్ ద్వారా వెనక్కి వెళ్ళకపోవడమే బెటర్ అన్న అనుభూతి కలుగుతుంది. పాత్రల పరంగా మహేష్ న్యాయం చేసినా… తెలుగు హీరోలను ఇలాంటి సినిమాలలో ప్రేక్షకులు అంగీకరించరన్న విషయం “1 నేనొక్కడినే” సినిమాతోనే స్పష్టమైంది.
పూర్తి లాజిక్ లతో సహజత్వానికి కాస్త దగ్గరగా ఉన్న ‘1 నేనొక్కడినే’ సినిమానే ప్రేక్షకులు కాదన్నారు. ఒకవేళ విక్రమ్ ఆశించినట్లు మహేష్ నటించి ఉంటే గనుక, ‘24’ సినిమా ఒక రోజు సినిమాగా టాలీవుడ్ లో ఆల్ టైం డిజాస్టర్ జాబితాలో చేరియుండేదని సినీ విశ్లేషకులు స్పష్టమైన అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు. బహుశా ప్రస్తుతం తమిళంలో ‘24’ సినిమాకు ఎదురైన అనుభూతి అప్పుడు తెలుగులో ఎదురై ఉండేదని అంటున్నారు. కాదంటారా…!



