ఆంధ్రప్రదేశ్, తెలంగాణాలలో అతి త్వరలో సినిమా టికెట్ల ధరలు పెరగనున్నాయి. అయితే ముందుగా ఏపీలో ఈ నెల 14న నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ మేరకు సమావేశమైన మంత్రులు యనమల రామకృష్ణుడు, చినరాజప్ప, నక్కా ఆనందబాబు, చింతకాయల అయ్యన్నపాత్రుడులతో కూడిన మంత్రి వర్గ ఉపసంఘం సమావేశమైంది. ఈ సమావేశంలో థియేటర్లలో టికెట్లను ఎకానమీ, డీలక్స్, ప్రీమియంగా విభజించారు.
ఎకానమీ విభాగంలో పెద్దగా పెరుగుదల లేకపోయినా డీలక్స్, ప్రీమియం విభాగపు టికెట్ల ధరలు పెంచే అవకాశమున్నట్టు అధికారులు తెలిపారు. గత నాలుగేళ్లలో ద్రవ్యోల్బణం రేటు 8 శాతం నుంచి 10 శాతానికి పెరగడంతో ఫిబ్రవరి 14న నిర్మాతల సంఘం, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు, థియేటర్ల యాజమాన్యాలతో సమావేశమై టికెట్ల ధరలపై నిర్ణయం తీసుకోనున్నారు. ఇదే సమావేశంలో టికెట్ల ధరలు ఇకపై ఆన్ లైన్ బుకింగ్ ద్వారా కొనుగోలు చేసే విధానం అమలులోకి తీసుకురావాలని, తద్వారా బ్లాక్ టికెట్లకు చెక్ చెప్పొచ్చని తెలిపారు.



