ఇరగదీసిన ఇండియా… మరో 87 చాలు..!

India Vs Australia 3rd Test Seriesవిరాట్ కోహ్లి లేకుండా టీమిండియా ఎలా ఆడుతుందా? అన్న ప్రశ్నకు మూడవ రోజు సమాధానం లభించినట్లయ్యింది. 52 పరుగులు వెనుకబడి బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా, తొలి సెషన్ ముగిసే సమయానికి 32 పరుగులు లీడ్ అందుకుని, ఆలౌట్ అయ్యింది. కీపర్ సాహాతో కలిసి రవీంద్ర జడేజా సూపర్ బ్యాటింగ్ చేయడంతో, టీమిండియా లీడ్ అందుకోగలిగింది. అయితే ఒక్కసారి జడేజా పెవిలియన్ చేరుకున్న తర్వాత మిగిలిన మూడు వికెట్లు రెప్పపాటు సమయంలో పడిపోయాయి. దీంతో ఒకానొక సమయంలో లీడ్ 50 పరుగులు దాటుతుందని భావించినప్పటికీ, 32 పరుగులకే పరిమితమైంది.

ఇక, రెండవ ఇన్నింగ్స్ ఆరంభించిన ఆస్ట్రేలియాకు టీమిండియా బౌలర్లు చుక్కలు చూపించారు. రెండవ ఓవర్లోనే వార్నర్ వెనక్కి పంపడం ద్వారా ప్రారంభమైన వికెట్ల పతనం, కంగారులు 137 పరుగులకు చేరుకునే సమయానికి ముగిసింది. మాక్స్ వెల్ ఒక్కడే దూకుడుగా ఆడుతూ 45 పరుగులు చేయగా, కెప్టెన్ స్మిత్ 17 పరుగులకే వెనుదిరిగాడు. తొలుత ఉమేష్ యాదవ్, భువనేశ్వర్ కుమార్లు అద్భుతమైన బంతులతో ఆకట్టుకోగా, దానిని అశ్విన్, జడేజాలు విజయవంతంగా కొనసాగించారు.

ADVERTISEMENT

ఉమేష్, జడేజా, అశ్విన్ లు చెరో 3 వికెట్లను సొంతం చేసుకోగా, భువనేశ్వర్ కుమార్ కు కీలకమైన స్మిత్ వికెట్ దక్కింది. ఇక 106 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా, మూడవ రోజు ముగిసే సమయానికి 6 ఓవర్లలో 19 పరుగులు చేసి, విజయానికి మరో 87 పరుగుల దూరంలో ఉంది. అయితే చేతిలో 10 వికెట్లు ఉండడంతో, నాలుగవ రోజు ఈ స్వల్ప లక్ష్యాన్ని చేధిస్తుందని క్రికెట్ ప్రేమికులు భావిస్తున్నారు. అయితే పిచ్ బౌలర్లకు అనుకూలిస్తుండడంతో, 87 పరుగులైనా గానీ భారీ లక్ష్యంగానే కనపడుతోంది.

మూడు టెస్ట్ లు ముగిసే సమయానికి 1-1తో సమానంగా ఉన్న ఇరు జట్లకు సిరీస్ దక్కాలంటే, ఈ మ్యాచ్ లో ఫలితం అనుకూలంగా రావాల్సిందే. ఆసీస్ 105 పరుగుల లోపు టీమిండియాను ఆలౌట్ చేయాల్సి ఉండగా, రెహనే నేతృత్వంలోని భారత జట్టు ఆ స్వల్ప లక్ష్యాన్ని విజయవంతంగా ముగించగలగాలి. దీంతో అందరి చూపులు నాలుగవ రోజు ప్రారంభం కాబోయే మొదటి సెషన్ ఆటపైనే ఉంది. తొలి గంట వికెట్లు పడకుండా ఆడగలిగితే గండం గట్టెక్కినట్లే భావించవచ్చని క్రీడా విశ్లేషకులు పేర్కొంటున్నారు.

ADVERTISEMENT
Latest Stories