ఎప్పుడో దేశానికి స్వాతంత్య్రం రాక మునుపు 1927లో నిర్మించిన పార్లమెంటు భవనానికి దాదాపు 88 ఏళ్లు నిండాయి. ఈ నేపథ్యంలో మరింత కాలం పాటు అదే భవనంలో పార్లమెంటును కొనసాగించడం ఇబ్బందికరమని ఇటీవల లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ అభిప్రాయపడ్దారు. ఈ భవనాన్ని కూల్చేసి రాజ్ పథ్ ప్రాంతంలో పార్లమెంటుకు కొత్త భవనం కడితే బాగుంటుందని కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి వెంకయ్య నాయుడుకు ఓ ప్రతిపాదన చేశారు.
తాజాగా ఈ ప్రతిపాదనకు మోడీ సర్కారు కూడా మద్దతు పలికింది. పార్లమెంటుకు కొత్త భవనానికి సంబంధించి సానుకూల నిర్ణయం తీసుకునే దిశగా త్వరలోనే ప్రభుత్వం ఓ అత్యున్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికిప్పుడు ఈ భవన నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా… అది పూర్తయ్యేందుకు మరో అయిదారేళ్ళ సమయం పడుతుందని పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ సరికొత్త పార్లమెంట్ అత్యాధునిక సౌకర్యాలతో కూడుకుని ఉంటుందని తెలుస్తోంది.



