అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఎంతగా పన్నులు, జరిమానాలు విదిస్తున్నా ప్రధాని మోడీ ఏమాత్రం వెనక్కు తగ్గడం లేదు. రష్యా నుంచి తక్కువ ధరకు భారత్ చమురు కొనుగోలు చేస్తూనే ఉంది. తనకు తన దేశ ప్రయోజనాలే ముఖ్యమని ప్రధాని మోడీ తెగేసి చెప్పారు.
ఈ కారణంగా నిన్నటి నుంచి భారత్ ఎగుమతులపై 50 శాతం పన్నులు అమలులోకి వచ్చాయి. కానీ రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం మానేస్తే 25 శాతం పన్ను తగ్గిస్తామని అమెరికా వాణిజ్య సలహాదారు పీటర్ నవారో చెప్పారు. కనుక రష్యా చమురు ముఖ్యమా లేక అమెరికాతో వాణిజ్యం ముఖ్యమా? తేల్చుకోవాలని సూచించారు.
ఇది భారత్ చెయ్యి మెలిపెట్టి లొంగదీసుకునే ప్రయత్నమే. అయితే రష్యా చమురు కొనుగోలు అంశం ఇప్పుడు బాగా హైలైట్ అవుతుండటంతో కొన్ని కొత్త ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
రష్యా నుంచి దాదాపు ఏడాదిగా చవుకగా చమురు కొనుగోలు చేస్తున్నప్పుడు, భారత్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఎందుకు తగ్గించలేదు?అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరిగితే ఆ భారం నేరుగా ప్రజలకు పంచేస్తున్నప్పుడు, ఇప్పుడు తగ్గించాలి కదా? కానీ ఎందుకు తగ్గించలేదు?అనే ప్రశ్న వినిపిస్తోంది.
తక్కువ ధరకు లభిస్తున్న చమురు వలన కలిగే ప్రయోజనం దేశ ప్రజలకు కాకుండా అంబానీ, ఆదానీలకు కట్టబెడుతున్నారని అమెరికా ప్రభుత్వం, రాహుల్ గాంధీ చేస్తున్న విమర్శలు ఆలోచింపజేస్తున్నాయి.
ఈ ఆరోపణలలో నిజానిజాలు సామాన్య ప్రజలకు తెలిసే అవకాశం లేదు. కానీ చమురు ధరలు తగ్గలేదనే విషయం మాత్రం అందరికీ తెలుసు.
రష్యా నుంచి చవుకగా లభిస్తున్న చమురు వలన దేశ ప్రజలకి ఎటువంటి ప్రయోజనం కలుగనప్పుడు దాని కోసం అమెరికా పన్నులు భరించాల్సిన అవసరం ఏమిటి?
ఆ పన్నుల వలన భారతీయ పరిశ్రమలు, వ్యవసాయ తదితర రంగాలు, అమెరికాతో వాణిజ్యం అన్నీ దెబ్బ తీసుకోవలసిన అవసరం ఏమిటి?
అమెరికా 50 శాతం సుంకాల వలన భారత్కు కలిగే నష్టం కంటే రష్యా చవుక చమురు వలన భారత్కు ఎక్కువ లబ్ది కలుగుతుందా?రెంటిలో ఏది లాభం? ఏది నష్టం? ఎవరికి లాభం? ఎవరికీ నష్టం?
అసలు రష్యా నుంచి తెచ్చుకుంటున్న ఆయిల్ అంతా ఎవరు తాగేస్తున్నారు? అని సామాన్య ప్రజలు సైతం ప్రశ్నించే పరిస్థితి నెలకొందిప్పుడు.




