ప్రజలే కాదు… పార్టీ నేతలు కూడా రావద్దంటున్నారు

internal-conflicts-in-ysrcp Prakasham Districtసిఎం జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న గడప గడపకి కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలకు ప్రజల నుంచి నిరసనలు, ఛీత్కారాలు ఎదురవుతూనే ఉన్నాయి. అయినా మళ్ళీ టికెట్‌ సంపాదించుకోవడం కోసం అవన్నీ భరించి తిరుగుతున్నారు. ఇప్పుడు వారికి మరో కొత్త సమస్య ఎదురవుతోంది.

ఎన్నికలకి ఇంకా చాలా సమయం ఉన్నప్పటికీ వైసీపీలో అప్పుడే టికెట్స్ కోసం పోటీ మొదలైపోయింది. కనుక పార్టీలో టికెట్‌ ఆశిస్తున్నవారు కూడా పోటాపోటీగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అంతవరకైతే పర్వాలేదు. కానీ టికెట్‌ ఆశించి లభించదని గ్రహించినవారు నియోజకవర్గం ఇన్‌ఛార్జ్‌లు గడప గడపకి కార్యక్రమంలో పాల్గొనేందుకు వస్తుంటే ముందుగానే ప్రజలను కలిసి సమస్యల గురించి గట్టిగా నిలదీయమని సూచిస్తున్నారు.

ADVERTISEMENT

మరికొందరు ఈ కార్యక్రమంలో జరిగే రభసను తమ మొబైల్ ఫోన్లలో చిత్రీకరించి సోషల్ మీడియాలో అప్‌లోడ్‌ చేస్తున్నారు. గమ్మతైన విషయం ఏమిటంటే, వైసీపీ ప్రత్యర్ధులను రాజకీయంగా దెబ్బతీయడానికి ఐ-ప్యాక్ ఎటువంటి వ్యూహాలు అనుసరిస్తుంటుందో వారు కూడా అలాగే రకరకాల వ్యూహాలతో నియోజకవర్గం ఇన్‌ఛార్జ్‌లను ముప్పతిప్పలు పెడుతున్నారు.

అయితే ఇవన్నీ పైకి చెప్పుకోలేని సమస్యలు కనుక పార్టీలో తమ వ్యతిరేక వర్గాన్ని కట్టడి చేసేందుకు ఎవరి వ్యూహాలు వారు అమలుచేసుకొంటున్నారు.

ఉదాహరణకు నెల్లూరులో ఎమ్మెల్యే అనిల్‌ కుమార్‌ యాదవ్‌, బాబాయ్‌ రూప్ కుమార్‌ యాదవ్‌ మద్య రోజూ ఇటువంటి యుద్ధాలే సాగుతున్నాయి. అలాగే మైలవరంలో మంత్రి జోగి రమేష్, ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌ మద్య పోస్టర్స్ యుద్దం కొనసాగుతోంది

ఒంగోలులో బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఇటువంటి ఇబ్బందులే ఎదుర్కొన్న సంగతి అందరూ చూశారు. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా, మేయర్ మనోహర్ నాయుడు మద్య కోల్డ్ వరంగల్‌ జరుగుతూనే ఉంది.

తాజాగా ప్రకాశం జిల్లాలో కొండెపి నియోజకవర్గం వైసీపీలో కూడా ఇటువంటి సమస్యలే ఉన్నాయని నేడు బయటపడింది. కొండెపి నియోజకవర్గం ఇన్‌ఛార్జ్‌ అశోక్ బాబు నేడు గడప గడపకి కార్యక్రమంలో పాల్గొనాలనుకొన్నారు. అయితే ఆయన వ్యతిరేకవర్గం మదాసు వెంకయ్య అనుచరులు ముందుగానే మిట్టపాలెం గ్రామంలో ప్రతీ ఇంటి గోడపై అశోక్ బాబు ఫోటోతో పోస్టర్స్ అంటించారు. వాటిలో “అశోక్ బాబు మా ఇంటికి రావద్దు. జగనన్నే మాకు ముద్దు,” అంటూ మిట్టపాలెం గ్రామప్రజల పేరిట పోస్టర్స్ అంటించారు.

దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. అశోక్ బాబు గ్రామంలో పర్యటిస్తే ఇరువర్గాల మద్య ఘర్షణలు జరిగే ప్రమాదం ఉందని ఈరోజుకి గడప గడపకి కార్యక్రమం వాయిదా వేసుకోవాలని కోరారు. కానీ ఈ విషయం తెలుసుకొన్న అశోక్ బాబు “నాకు వ్యతిరేకంగా పోస్టర్స్ వేయించే మొగాడు ఊర్లో ఎవరున్నారు?” అంటూ ఆగ్రహంతో ఊగిపోయారు.

రాజకీయంగా తన ఎదుగుదలని చూసి ఓర్వలేక పార్టీలో కొందరు ఇటువంటి నీచరాజకీయాలు చేస్తున్నారని, వారి గురించి అధిష్టానానికి ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.

ఓ వైపు అధినేత, మరోవైపు ప్రజలు, పార్టీలో వ్యతిరేక వర్గం, ప్రతిపక్షాలు ఎందరిని చక్కబెట్టుకొని రావాలో?అందరినీ చక్కబెట్టుకొచ్చిన్నా ప్రజలలో వైసీపీ పాలన పట్ల నానాటికీ వ్యతిరేకత పెరుగుతోంది కనుక ఎన్నికలలో గెలుస్తామో లేదో?అనే భయం కూడా లోలోన ఉండనే ఉంటుంది.

ADVERTISEMENT
Latest Stories